కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు, మంత్రివర్గ సమావేశంలో దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం కింద నెలకు రూ.10 వేలు అందిస్తామని చెప్పారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీని అమలుచేసే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయంలో న్యాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటుకు ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. బెంగళూరుకు చెందిన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ ఇనిస్టిట్యూట్ను అమరావతిలో ఏర్పాటుచేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
జూనియర్ న్యాయవాదులకు శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటు అంశంపైనా కసరత్తు చేయాలన్నారు. అనంతరం ప్రాసిక్యూషన్ విభాగంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. నమోదైన కేసులు, రుజువైన నేరాల అంశంలో శిక్షపడే శాతం పెరగాలని, దర్యాప్తు వేగవంతంగా పూర్తిచేసే పద్ధతులను అవలంబించాలని చంద్రబాబు సూచించారు. తప్పుచేసినవారికి శిక్షపడుతుందనే నమ్మకం కలిగేలా ప్రాసిక్యూషన్ ఉండాలన్నారు. న్యాయశాఖపై మరింత సమగ్రంగా సమీక్ష చేయాలని, మరిన్ని వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa