ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెడ్‌బుక్‌ అమలు ఎప్పుడో ప్రారంభమైనది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 11:39 AM

రెడ్‌బుక్‌ అమలు ఇప్పటికే ప్రారంభమైందని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్‌ అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినవారికి శిక్ష తప్పదంటూ తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని వదిలేది లేదని.. ఇందులో భాగంగా ఐపీఎ్‌సలు కూడా సస్పెండ్‌ అయ్యారని గుర్తుచేశారు. గురువారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. విశాఖ పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 12.30 వరకు ప్రజల వినతులు స్వీకరించారు. గత ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. విద్యుత్‌ బిల్లు 300 యూనిట్లు దాటిందనే కారణంతో జగన్‌ సర్కారు ఇంజనీరింగ్‌, డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయకుండా నిలిపివేసిందని, ఆ బకాయిలను విడుదల చేయాలని విస్తృత దళిత సంఘాల వేదిక ప్రతినిధులు లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు.


ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, వైసీపీ హయాంలో జరిగిన దళితుల హత్యలు, దాడులపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని అభ్యర్థించారు. కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ నర్సెస్‌ స్ట్రగుల్‌ కమిటీ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులకు 4సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించడంతోపాటు రిటైరైన వారికి రూ.10 వేలు పెన్షన్‌ ఇవ్వాలని, కరోనాతో మృతిచెందిన వారికి పరిహారం అందించడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ-2008లో ఎంపికై నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని ఏపీ వెలుగు టీచర్స్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు కోరారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారందరికీ హామీ ఇచ్చారు. అనంతరం నాయకులు, నేతలతో లోకేశ్‌ వివిధ అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు, కోండ్రు మురళీ మోహన్‌, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa