చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి లడ్డూ వేలంపాట నిర్వహించారు. స్థానిక (పూతలపట్టు) ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో గురు ప్రసాద్ ఆధ్వర్యంలో బహిరంగ లడ్డూ వేలంపాట జరిగింది. స్వయంభూ శ్రీ వరసిద్ధివినాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ముగియడంతో ఈ లడ్డూ వేలంపాట నిర్వహించారు. కాణిపాకం ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో కాణిపాకం ఆలయ పవిత్రమైన మహా ప్రసాదమైన భారీ లడ్డూ.. వేలం పాటలో రూ.4 లక్షల 25 వేలు పలికింది. ఈ లడ్డూ వేలం పాటలో 21 కేజీల బరువు ఉన్న భారీ లడ్డూలు రూ.4 లక్షల 25 వేలకు విజయం విద్యాసంస్థల అధినేత తేజోమూర్తి దక్కించుకున్నారు.
ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో గురు ప్రసాద్ వేద పండితులు భారీ లడ్డూను తేజోమూర్తి, శైలజ దంపతులకు అందజేశారు. కాణిపాకం వినాయకుడి లడ్డూ ప్రసాదం దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు తేజోమూర్తి దంపతులు.
గతేడాది కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి లడ్డూ ధర రూ.1.28 లక్షలు పలికింది. అగరంపల్లెకు చెందిన చరణ్రెడ్డి లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నారు. మూడేళ్ల క్రితం కాణిపాకం వినాయకుడి లడ్డూను తెలంగాణకు చెందిన వ్యక్తి వేలం పాటలో దక్కించుకోవడం విశేషం. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో వినాయక లడ్డూలకు వేలం పాట నిర్వహించగా.. ఏకంగా రూ.కోట్లలో కూడా పలికింది. హైదరాబాద్ రిచ్మండ్ విల్లాలో రికార్డు స్థాయిలో రూ.కోటి 86 లక్షలు పలికింది.. అలాగే బాలాపూర్ లడ్డూ రూ.30 లక్షవరకు పలికింది.
కాణిపాకంలో ప్రత్యేకోత్సవాల్లో భాగంగా చివరి రోజు (శుక్రవారం) రాత్రి సిద్ధిబుద్ధి సమేతుడైన వరసిద్ధి వినాయకస్వామివారు పవిత్ర పుష్కరిణిలో తెప్పల విహరించారు. ముందుగా విద్యుత్తు దీపాలంకరణ, పుష్పాలతో రూపొందించిన తెప్పలపై ఉత్సవమూర్తులను అధిష్ఠింపజేయగా.. పుష్కరణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే పుష్కరిణిలో కర్పూర హారతులు, బెల్లం, చిల్లర నాణేలను భక్తులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. కాణిపాకం వినాయక స్వామివారి ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి శుక్రవారం వరకు 21 రోజులపాటు బ్రహ్మోత్సవాలు, ప్రత్యేకోత్సవాలు తెప్పోత్సవంతో ముగిశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa