తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందనేదీ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా మారింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై ప్రాథమిక ఆధారాలు లేకుండానే సీఎం ఎలా ప్రకటన చేస్తారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన ఇలాంటి అంశాలలో రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం నేరుగా విలేకర్ల సమావేశంలో మాట్లాడటం ఏమిటంటూ విచారణ సందర్భంగా ప్రభుత్వ తరుఫు న్యాయవాదిని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే తిరుమల లడ్డూ అంశంలో దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విషయంలోనూ సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ఘటనలో సిట్ సరిపోతుందా? స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు అవసరమా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి స్పందించారు.
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలపై ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి రియాక్టయ్యారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందనే మాట వాస్తవమని మంత్రి చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ ప్రాథమిక దశలోనే ఉందన్న మంత్రి.. పూర్తి స్థాయి విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. కింది స్థాయి దర్యాప్తులో తేలిన అంశాలను సుప్రీంకోర్టుకు నివేదించాల్సి ఉందన్నారు. తిరుపతి లడ్డూ కల్తీ ఘటనపై సిట్ బృందం ప్రాథమిక నివేదికల ఆధారంగా దర్యాప్తు చేస్తోందన్న డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు. కోర్టులపై తమకు, తమ ప్రభుత్వానికి నమ్మకం ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.
మరోవైపు ప్రకాశం జిల్లాలోని సూరారెడ్డిపాలెంలో మంత్రి బాల వీరాంజనేయస్వామి పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి నెలా ఒకటే తేదీ పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరుగుతుందని మంత్రి అన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధే టీడీపీ కూటమి ప్రభుత్వం లక్ష్యమన్న డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.. అందుకే అధికారంలోకి రాగానే పింఛన్లను నాలుగు వేలకు పెంచామన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని.. ఒకవేళ ఆ రోజు సెలవు వస్తే ముందే అందిస్తున్నామన్నారు. ఇక వచ్చే దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కూడా ప్రారంభిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa