తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. ఐదుగురు సభ్యులతో.. వీరిలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది. తిరుమల లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే తిరుమల లడ్డూ అంశంపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది.
అంతకుముందు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తన అభిప్రాయాన్ని తెలిపారు. తిరుమల లడ్డూకు సంబంధించిన మొత్తం అంశాన్ని పరిశీలించానని.. సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు అన్నారు. అలాగే తిరుమల లడ్డూపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారని.. సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో.. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్, విక్రమ్ సంపత్ అనే భక్తుడు పిల్ దాఖలు చేశారు. లడ్డూ కల్తీ వివాదంపై దాఖలైన అన్ని పిల్స్ కలిసి అక్టోబర్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ని కొనసాగించాలా?... లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అనే అంశంపై కేంద్రం అభిప్రాయాన్ని కోరింది.. ఈ మేరకు అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కోర్టు సూచించింది. ఈ అంశంపై మళ్లీ గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు విచారణ జరగ్గా.. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తనకు నాలుగో కోర్టులో మరో కేసు విచారణలో ఉందని.. ఈ కేసు విచారణను శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు తీసుకోవాలని సుప్రీం కోర్టుకు విన్నవించారు.
మెహతా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ బీఆర్ గవాయి.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం కేసును శుక్రవారం మొదటి నంబర్ కింద విచారణ చేయడానికి అంగీకరించారు.. ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఐదుగురు కేంద్ర, రాష్ట్ర అధికారులతో కలిసి సిట్ ఏర్పాటు చేసింది. సీబీఐ డైరెక్టర్ ఇద్దరు అధికారుల పేర్లను తెలియజేయనున్నారు.. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఇద్దరు అధికారుల పేర్లను ఇవ్వాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa