హర్యానాలో మొదట ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ వెంటనే అనూహ్యంగా వెనకబడింది. అప్పటివరకు వెనుకంజలో ఉన్న అధికార బీజేపీ.. ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ.. ఈ హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, లెక్కింపుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఫలితాల వెల్లడి సమయంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య ఈసీ వెబ్సైట్లో ఎన్నికల సంఘం అధికారులు డేటాను అప్డేట్ చేయడంలో జాప్యం చేశారని ముందు నుంచీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.
హర్యానాలో పార్టీ ఓటమి చెందడంతో.. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించడం లేదని తేల్చి చెప్పారు. హర్యానా ఫలితాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని.. చాలా ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించారు. ప్రధానంగా హర్యానాలోని 3 జిల్లాల నుంచి చాలా సీరియస్గా ఫిర్యాదులు వచ్చినట్లు జైరాం రమేష్ మీడియాకు వివరించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితికి.. హర్యానా ఎన్నికల ఫలితాలు దూరంగా ఉన్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఫలితాలపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసి బీజేపీ విజయాన్ని సాధించిందని ఆరోపణలు గుప్పించారు. ఇక ఈ హర్యానా ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని జైరాం రమేష్ స్పష్టం చేశారు.
ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్-ఈవీఎంలలో తీవ్ర అవకతవకలు జరిగాయని.. ప్రజల అభీష్టాన్ని బీజేపీ తారుమారు చేసిందని కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేష్.. తీవ్ర ఆరోపణలు చేశారు. మధ్యాహ్నం వరకు తాను ఎన్నికల సంఘంతో సంప్రదింపులు చేస్తూ 3 జిల్లాల్లోని ఈవీఎంలపై ఫిర్యాదు చేసినట్లు జైరాం రమేష్ వెల్లడించారు. హర్యానాలో ఫలితాలు పూర్తిగా అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయని పేర్కొన్న ఆయన.. ప్రజాస్వామ్య ప్రక్రియను బీజేపీ నాశనం చేసిందని విమర్శించారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల గురించి ఒక వ్యాక్యంలో చెప్పాలంటే.. ఇది వ్యవస్థ విజయమని.. ప్రజాస్వామ్యం ఓటమి అని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా విమర్శలు గుప్పించారు. ఈ ఫలితాలను తాము అంగీకరించలేమని.. ఫిర్యాదులు సేకరిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు హర్యానాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులు అన్నింటినీ కలిపి.. ఎన్నికల కమిషన్కు వెళ్లి అక్కడ ఫిర్యాదులును నమోదు చేస్తామని పవన్ ఖేరా స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa