తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంచిపై చెడు గెలిచిన సందర్భంగా దసరా పండగ నిర్వహించుకుంటారని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈసారి దానితోపాటు ఏపీలో వైసీపీపై ఎన్డీయే కూటమి గెలిచిన సందర్భంగా పండగ ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్ వేదికగా దసరా శభాకాంక్షలు తెలుపుతూ మంత్రులు ట్వీట్ చేశారు."తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను ప్రజలే అంతమొందించారు. వైసీపీ చెడుపై కూటమి మంచి విజయం సాధించింది. వరద రూపంలో వచ్చిన విపత్తుపై విజయం సాధించాం. వేలాది ఉద్యోగాలు ఇచ్చే లులూ, ఫాక్స్ కాన్, హెచ్సీఎల్ విస్తరణ, టీసీఎస్ తెచ్చుకున్నాం. పోలవరం సాకారం కానుంది. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన జరగనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తోంది. ఇన్ని మంచి విజయాలు అందించిన ఈ విజయదశమిని సంతోషంగా జరుపుకుందాం. ప్రజా సంక్షేమం- రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా శ్రమిస్తున్న మంచి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు, దుర్గమ్మ ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నా"."జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే అంటూ ఆ పరమేశ్వరిని హైందవులంతా కొలిచే నవరాత్రులు ముగింపుగా ప్రవేశిస్తున్న విజయ దశమి పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. భారతదేశం నలుమూలలా భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ శరన్నవరాత్రులను ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వేడుకగా చెప్పుకోవచ్చు. ఊరు, వాడలంతా అమ్మవారి సంబరాలతో భక్తి భావం ఉట్టిపడుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటగా, ఆంధ్రప్రదేశ్లో ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయం కిక్కిరిసి భక్తులతో అలరారుతోంది. ఈ నవరాత్రులలో దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ విజయదశమి ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా విరాజిల్లాలని శక్తి స్వరూపిణిని ప్రార్థిస్తున్నాను". ఏపీ ప్రజలందరికీ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి సందర్భంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికీ విజయాలు లభించాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa