ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులకు లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. అయితే మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉండటం విశేషం. ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు రెండు షాపులు దక్కాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెండు వైన్షాపులను వీరు దక్కించుకున్నారు. మచిలీపట్నం 1వ నంబర్ షాపు కర్ణాటకకు చెందిన మహేశ్ ఎ బాతే రాగా.. 2వ నంబర్ షాపు యూపీకి చెందిన లోకేశ్ చంద్కు దక్కింది. మద్యం షాపుల లాటరీలో వారి పేర్లు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. మిగిలిన షాపులకు జిల్లా అధికారులు లాటరీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపుల లాటరీ ప్రక్రియను.. అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ లాటరీ నిర్వహిస్తున్నామన్నారు. షాపుల విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే నేరుగా జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయొచ్చన్నారు. లాటరీ సమయంలో దరఖాస్తుదారు హాజరు తప్పనిసరి కాదని.. దరఖాస్తుదారు లేకపోయినా వారికి లాటరీ తగిలితే అధికారులు సమాచారం అందజేస్తారని చెప్పారు.
కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నంలోని హిందూ కాలేజీలో మద్యం షాపుల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎక్సైజ్ అధికారులు లాటరీ తీసి మద్యం షాపులకు సంబంధించిన లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 123 మద్యం దుకాణాలకు 2942 దరఖాస్తులు దాఖలయ్యయి. అయితే షాపులు వచ్చిన వారు ఆనందంలో ఉంటే.. షాపులు రాని వారు నిరుత్సాహంలో ఉన్నారు.
ఏపీలో ఇవాళ మద్యం షాపులకు సంబంధించిన లాటరీ పూర్తవుతుంది.. ఈ నెల 15న షాపులు కేటాయిస్తారు.. ఈ నెల 16 నుంచి మద్యం అమ్మకాలు మొదలు పెట్టుకోవచ్చు. అంటే బుధవారం నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తుంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా మద్యం స్టాక్ డిపోలకు చేరింది.. అక్కడి నుంచి కొత్త షాపులకు సరఫరా చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa