గ్రామ పంచాయతీల అభివృద్ధే ధ్యేయంగా పల్లె పండుగ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల రూపురేఖలను మార్చనుంది. ఈ పండుగను కృష్ణాజిల్లా కంకిపాడు నుంచే ప్రారంభించనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ చేతుల మీదుగా పల్లె పండుగ– పంచాయతీ వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభంకానున్నాయి. కంకిపాడులోని టీడీపీ కార్యాలయ ఆవరణలో సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కంకిపాడులో రూ. 91 లక్షలతో నిర్మించే 11 సిమెంటు రోడ్లు, రూ. 4.15 లక్షలతో రెండు గోకులాలు, పునాదిపాడులో రూ.54 లక్షలతో రెండు సిమెంటు రోడ్ల నిర్మాణానికి పవన్కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు.
అలాగే కంకిపాడులో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పల్లె పండుగ– పంచాయతీ వారోత్సవాలు జరపనున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల రూపురేఖలు మార్చనున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టనున్న 2,113 అభివృద్ధి పనులకు రూ.169 కోట్లు మంజూరయ్యాయి. వీటితో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, శ్మశానాలు, ప్రభుత్వ భవనాలు, పాఠశాల భవనాలకు ప్రహరీలు, డ్రెరున్లు నిర్మించనున్నారు. అలాగే రోజు వారీ పనులు చేసే కూలీలకు చెల్లింపులు చేయనున్నారు. కంకిపాడులో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖమంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొననున్నారు. కాగా, కంకిపాడులో జరిగే పల్లె పండుగ సభ ఏర్పాట్లను పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ, జనసేన సమన్వయకర్త ముప్పా రాజా తదితరులు ఆదివారం పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa