మహారాష్ట్రలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే వివిధ వర్గాలకు ఊరటనిచ్చేలా అనేక పథకాలు, నిర్ణయాలను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాహనదారులకు మహారాష్ట్ర సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఇక నుంచి ముంబై నగరంలోకి ప్రవేశించే.. లైట్ మోటార్ వాహనాలకు ఆ మార్గంలో ఉండే టోల్ ప్లాజాల్లో టోల్ ఫీజులు వసూలు చేయమని తేల్చి చెప్పింది. కార్లు, ఎస్యూవీలకు.. సోమవారం అర్ధరాత్రి నుంచే టోల్ ఫీజులు వసూలు చేయమని స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో సోమవారం జరిగిన మహారాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. థానే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏక్నాథ్ షిండే.. గతంలో అనేక సార్లు టోల్ వసూళ్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే.. తాజాగా టోల్ ఛార్జీలు వసూలు చేయడాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏక్నాథ్ షిండే సర్కార్కు ఇదే చివరి కేబినెట్ భేటీ కావడంతో.. టోల్ ఛార్జీల రద్దుతోపాటు మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
ఇక షిండే సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ముంబై నగరంలోకి వాహనాలకు వచ్చే 5 టోల్ప్లాజాల వద్ద టోల్ ఛార్జీల భారం తేలనుంది. దహిసర్, ములుంద్, వాషి, ఐరోలి, తిన్హంత్ నాకా ప్రాంతాల్లో ఉన్న టోల్ ప్లాజాల వద్ద కార్లు, ఎస్యూవీలు ఎలాంటి టోల్ ఛార్జీలు చెల్లించకుండా దూసుకెళ్లిపోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం టోల్ ఫీజు రూ.45 వసూలు చేస్తున్నారు. ముంబై నగరంలోకి నిత్యం ప్రవేశించే చిన్న వాహనాలతో రోజువారీ ప్రయాణికులకు ఊరట కలిగిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇటీవల మరణించిన టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాకు గౌరవార్థం.. మహారాష్ట్ర స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఆయన పేరును పెట్టారు. ఇక నుంచి రతన్ టాటా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీగా పేరు మార్చారు. ఇక టోల్ ఫీజులను రద్దు చేస్తూ ఏక్నాథ్ షిండే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఓట్లను దండుకోవడానికి చేసిన పొలిటికల్ స్టంట్ అంటూ మండిపడ్డాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేత ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. ఇక మహారాష్ట్రతోపాటు జార్ఖండ్ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa