మంత్రి లోకేష్ ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను, ఎలక్ట్రానిక్ రంగంలో అగ్రసంస్థలతో నిన్న భేటీ అయ్యారు. ఢిల్లీలోని కౌశల్ భవన్లో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్ శాఖ కేంద్రమంత్రి జయంత్ చౌదరి, సెక్రటరీ అతుల్ కుమార్ తివారీ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో వేద్ మణి తివారీలతో నారా లోకేష్, ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఏపీలో చేపట్టనున్న స్కిల్ సెన్సస్పై మంత్రి లోకేష్ స్పెషల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ ప్రణాళికలు, దేశంలోనే మొదటిసారిగా జరుగుతున్న స్కిల్ సెన్సస్కి సహకారం అందించాలని కేంద్ర మంత్రి, సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్ అధికారులను మంత్రి లోకేష్ కోరారు.
స్కిల్ సెన్సస్ లక్ష్యం, ఎలా చేపడుతున్నారని కేంద్రమంత్రి ఆరా తీశారు. స్కిల్ సెన్సస్ పైలెట్ ప్రాజెక్టు పూర్తి కాగానే గుర్తించిన లోటుపాట్లు సరిచేసి రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని లోకేష్ వివరించారు. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో లక్షలాది ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ సెన్సస్ చేపట్టిందని మంత్రి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యం చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మంత్రిత్వశాఖల నుంచి ఏపీకి ఏమేం కావాలో వివరిస్తూ ఓ లేఖను మంత్రి నారా లోకేష్ అందజేశారు. అలాగే ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ప్రతినిధులతో మంత్రి లోకేశ్ నేడు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్ర అధ్యక్షత వహించారు. అలాగే ఆదివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్షాను లోకేష్ కలిసిన విషయం తెలిసిందే. దాదాపు 40 నిమిషాల పాటు అనేక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను అమిత్ షాకు వివరించి... రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కేంద్రమంత్రికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa