ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలు ప్రాజెక్టు మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం.. విజయవాడ, విశాఖపట్నాల్లో మెట్రోరైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల కోసం.. 2024 ధరల ప్రకారం రూ.42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి ప్రతిపాదించింది. విజయవాడలో మెట్రోను రెండు దశల్లో మూడు కారిడార్ల పనులకు రూ.25,130 కోట్లు.. విశాఖలో మెట్రోను రెండు దశల్లో నాలుగు కారిడార్ల పనులకు రూ.17,232 కోట్లు అవసరమని అంచనా వేసింది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లో మెట్రోరైలు ప్రాజెక్టులకు హామీ ఉంది. ఈ మేరకు మెట్రో నిర్మాణానికి కేంద్రమే నిధులివ్వాలని.. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కలిపి 258 ఎకరాల భూ సేకరణకు అయ్యే రూ.2,799 కోట్లు మాత్రం రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని ప్రస్తావించారు. అయితే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖలో మెట్రోరైలు ప్రాజెక్టుల ఏర్పాటు కోసం డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించింది. ఆ తర్వాత మెట్రోరైలు కొత్త విధానం ప్రకారం వాటిని సవరించాలని కేంద్రం సూచించింది.
ఆ తర్వాత గత ప్రభుత్వం మెట్రోరైలు ప్రాజెక్టులను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. విజయవాడలో భూ సేకరణ ప్రతిపాదనలనూ రద్దుచేయగా.. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముందు విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పేరుతో హడావిడి నడిచింది కానీ ఒక్క అడుగు పడలేదు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టులపై కేంద్రానికి రిక్వెస్ట్ చేసింది. కేవలం మూడు నెలల్లోనే డీపీఆర్లు సిద్ధం చేయించింది.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక పరిమితులు, నిధుల కొరత ఉందని.. అందుకే ఈ ప్రాజెక్టులకు అయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరించాలని కోరింది. ఈ మేరకు 2017లో కోల్కతా మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం 100శాతం నిధులు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇటీవల మంత్రి నారాయణ కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ని కలిసి మెట్రో ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావించారు. కోల్కతా మోడల్లో ఆంధ్రప్రదేశ్కూ నిధులివ్వాలని కోరారు. మరి కేంద్రం ఎలా స్పందిస్తుంది.. మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తుందనేది తేలాల్సి ఉంది.
విజయవాడలో మొదటి దశ
కారిడార్-1 పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం
కారిడార్-2 పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు
విజయవాడలో రెండో దశ
పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతికి
విశాఖపట్నం మెట్రో రైలు
మొదటి దశ
కారిడార్-1 స్టీల్ప్లాంట్ గేటు నుంచి కొమ్మాది కూడలి
కారిడార్-2 గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు
కారిడార్-3 తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు
రెండో దశ
కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa