ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాబోతోంది. బాపట్ల జిల్లా అద్దంకిని రెవెన్యూ డివిజన్గా ప్రకటించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు, జె.పంగులూరు మండలాలతో కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అద్దంకి ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సొంత నియోజకవర్గం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరను కూడా రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూటమి తరఫున చంద్రబాబు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లపై హామీలు ఇచ్చారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని.. జిల్లా చేయకుండా రాజంపేట ప్రజలకు అన్యాయం చేశారన్నారు. రాజంపేట, రాయచోటి, మదనపల్లెకి న్యాయం చేస్తామన్నారు. అంతేకాదు ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అంతేకాదు హిందూపురం నుంచి జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్పై నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కూడా రిక్వెస్ట్ చేశారు. వీటితో పాటుగా పలు జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై హామీలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఈ అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఏపీ ప్రభుత్వం మొత్తం 30 జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వెంటనే ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఆ ట్వీట్లో.. 'ఒక సామాన్యుడు ఇచ్చిన సలహాని, ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటిస్తూ, సమాజంలో అశాంతి రేపడానికి కొంత మంది అల్లరి మూకలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా రద్దు చేస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం'అంటూ ట్వీట్ చేసింది. దీంతో అదంతా ప్రచారం మాత్రమేనని తేలింది. ఇప్పుడు మళ్లీ అద్దంకిని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa