ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ నాలుగు ఆలయాలను 6 నెలల పాటు మూసి వేయనున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది చార్ధామ్ యాత్ర చివరి దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. ఆ తర్వాత ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు (ఆదివారం) మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులను మూసివేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
దీపోత్సవంతో గంగోత్రి ధామం తలుపులు మూసివేసే ప్రక్రియను మొదలుపెట్టినట్లు పంచ గంగోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేష్ సెమ్వాల్ చెప్పారు. ఆ తర్వాత గంగామాత ఉత్సవ విగ్రహంతో డోలి యాత్ర నిర్వహించి శీతాకాలపు విడిదికి తీసుకువస్తామని తెలిపారు. మరోవైపు.. యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆదివారం యమునోత్రి ధామ్ మూసివేసిన తర్వాత యమునా దేవి ఉత్సవ విగ్రహాన్ని ఖర్సాలీలోని దేవాలయానికి తీసుకురానున్నారు. ఇక ఈ ఏడాది చార్ధామ్ యాత్ర సందర్భంగా శుక్రవారం సాయంత్రం వరకు 15,21,752 మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను సందర్శించుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ 15 లక్షల మంది భక్తుల్లో 7.10 లక్షల మంది యమునోత్రి ధామ్ను సందర్శించగా.. గంగోత్రి ధామ్ను 8.11 లక్షల మంది భక్తులు సందర్శించినట్లు అధికారులు వివరించారు. చార్ధామ్లో కీలకమైన కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. గర్వాల్ హిమాలయాల్లో ఉన్న ఈ ధామ్ను చార్ధామ్ యాత్రలో ఎక్కువగా సందర్శించే ఆలయాల్లో ఒకటి కావడం గమనార్హం. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్ ధామ్ను నవంబర్ 17వ తేదీన రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు.
చార్ధామ్ యాత్రలో భాగంగా ప్రతీ ఏడాది దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శిస్తారు. ఈ ఆలయాలకు సమీపంలో ఉన్న జ్యోతిర్లింగాలను సందర్శించి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. శీతాకాలం సందర్భంగా ఈ చార్ ధామాలు మంచుతో కప్పబడి ఉండటంతో ఆ సమయంలో మూసివేసి.. తిరిగి వేసవిలో మళ్లీ ఈ ఆలయాల తలుపులను తెరవనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa