ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్కార్డుల జారీపై ఫోకస్ పెట్టింది. కొత్త డిజైన్లతో రేషన్ కార్డుల్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోలతో బియ్యం కార్డుల్ని ముద్రించగా.. కూటమి ప్రభుత్వం సరికొత్తగా టెక్నాలజీని జోడించి కార్డులు ముద్రించి ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. ఈ కొత్త రేషన్కార్డులలో క్యూఆర్ కోడ్తో పాటు కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా ఉండేలా ప్లాన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా వివాహమైన వారికి కొత్త కార్డులు మంజూరు చేయనున్నారు. వివాహ నమోదు పత్రం ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డు జారీ చేయనున్నారు.
అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన అందరికీ కొత్తగా కార్డులు ఇవ్వనున్నారు. అలాగే తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారికి.. ఒంటరిగా ఉన్న వారికి రేషన్ కార్డులు ఇస్తారు. ఇటీవల పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్కార్డుల అంశాన్ని ప్రస్తావించారు.. త్వరలోనే అందుబాటులోకి వస్తాయని చెప్పారు.ప్రధానంగా కొత్త రేషన్ కార్డుల మంజూరు, కుటుంబాల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్పులు, కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చిరునామా మార్పు, కార్డులను సరెండర్ చేయడం వంటి ఆప్షన్ కూడా ఇస్తారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
మరోవైపు ఏపీలో కూడా రేషన్ షాపుల్లో ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల తరహాలో రైస్ ఏటీఎంలను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రాల్లో రైస్ ఏటీఎంలతో లబ్ధిదారులకు ఊరట దక్కింది.. క్యూ లైన్లలో నిలబడకుండా నిమిషాల్లోనే సరకులు తీసుకొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు ఈ నెల నుంచి రేషన్ సరుకుల్లో బియ్యంతో పాటుగా కందిపప్పు, పంచదార, జొన్నలు కూడా ఇస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో మిగిలిన సరుకుల్ని కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరికొన్ని రేషన్ షాపుల్ని కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. అంటే రేషన్ పంపిణీ షాపుల్లో కొనసాగనుంది.
మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 29,796 దుకాణాలకు అదనంగా మరో 4 వేలు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. మళ్లీ రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. కార్డుదారులకు వీలైనంత దగ్గరలో రేషన్ షాపులు ఉండేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న చోట్ల డీలర్లను నియమించడంతోపాటు కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా రేషన్ షాపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి షాపు పరిధిలో 500 కార్డులు వస్తాయి.. కొన్ని చోట్ల ఒక్కో షాపు పరిధిలో 1,000 నుంచి 1,200 వరకు కార్డులున్నాయి. అందుకే ఇలా ఎక్కువ కార్డులు ఉన్నచోట అదనపు రేషన్ షాపులు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఒక్కో షాపునకు 700, గ్రామీణ ప్రాంతాల్లో 750 కార్డులు మించకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇలా 4వేల కొత్త షాపుల్ని ఏర్పాటు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa