ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్వయసాయ బడ్జెట్ను 43,402 కోట్లతో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విపత్తుల సమయంలో పంట నష్టానికి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచినట్లు తెలిపారు. గతంలో హెక్టారుకు రూ.17 వేలు సాయం అందించేవారని.. ఇప్పుడు దానిని రూ.25 వేలకు పెంచామని చెప్పారు. ఈ మేరకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేశామని ప్రకటించారు. ఈ ఏడాది జులైలో భారీ వర్షాలు, వరదలతో రైతులు పంట నష్టపోయారని.. 4 జిల్లాల్లో పంట దెబ్బతిన్న 23,259 మంది రైతులకు రూ.25.75 కోట్ల పెట్టుబడి రాయితీని త్వరలో అందిస్తామని తెలిపారు. ఈ-పంట ద్వారా 21 జిల్లాల్లో పంట నష్టపోయిన 1.90 లక్షల మంది రైతులకు రూ.284.56 కోట్లు జమ చేశామని చెప్పారు.
ఈ బడ్జెట్లో ప్రభుత్వం రైతులకు కీలకమైన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రూ.4,500 కోట్లు నిధులు కేటాయించింది. రైతులకు పంట రుణాలు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాగుదారుల హక్కు చట్టం -2024 తీసుకొచ్చామన్నారు మంత్రి. అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్, పంటల బీమా, వడ్డీ లేని పంట రుణాలు, రైతు బృందాలకు డ్రోన్ల సరఫరా, రాయితీపై వ్యక్తిగత యంత్ర పరికరాలు, బంజరు భూముల్ని సాగులోకి తేవడం వంటి కార్యక్రమాలపై కీలక ప్రకటన చేశారు.
2024-25లో 1.74 లక్షల ఎకరాలను వ్యవసాయ పంటల నుంచి ఉద్యాన పంటల కిందకు తీసుకొస్తామని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. 11 ఉద్యాన పంటలను క్లస్టర్ విధానంలో ప్రోత్సహిస్తున్నామని.. బహుళ అంతస్తుల పంటలు, అంతర పంటలను ప్రోత్సహిస్తామని చెప్పారు. అంతేకాదు భూసార పరీక్షా పత్రాల జారీ, పొలం పిలుస్తోంది, ఫార్మర్స్ రిజిస్ట్రీ, డ్రోన్ వినియోగంపై శిక్షణ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో వరదల కారణంగా సంభవించిన పంట నష్టానికి పెట్టుబడి రాయితీని పెంచడంతో పాటుగా నెల రోజుల్లోనే రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బుల్ని జమ చేశామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa