ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఫలితాల తర్వాత పార్టీకి ముఖ్య నేతలు గుడ్ బై చెబుతున్నారు.. ఈ క్రమంలో అధినేత వైఎస్ జగన్ పార్టీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా కొత్తగా అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల్లో పదవులు కేటాయిస్తున్నారు. అలాగే అవసరమైన చోట్ల నియోజవర్గాలకు కొత్త సమన్వయకర్తల్ని నియమిస్తున్నారు. తాజాగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వైఎస్సార్సీపీ షాకిచ్చింది.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలువురు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు నియామకాలకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్ను నియమించారు. ఆయన ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రచార విభాగం జోనల్ ఇంఛార్జ్గా ఉన్నారు.. అలాగే పార్టీ పరిశీలకుడిగా కూడా పనిచేశారు. తాజాగా నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.
అలాగే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులును నియమించారు. అయితే ఆముదాలవస నియోజకవర్గ బాధ్యతలు కొత్తవారికి అప్పగించడం ఆసక్తికరంగా మారింది.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మొన్నటి వరకు ఆయనే నియోజకవర్గ బాధ్యతల్ని చూస్తున్నారు. అయితే తమ్మనేనికి వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు అప్పగించింది.
మరోవైపు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశం అ్యారు. శాసన మండలిలో ఎమ్మెల్సీలు కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తామన్న భయంతోనే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. అయినా సరే మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని.. మండలిలో ఎమ్మెల్సీలు ప్రభుత్వ విధానాలపై నిలదీయాలని సూచించారు. మీడియా వేదికగా ఎమ్మెల్యేలు తమ గళాన్ని ప్రజలకు వినిపిస్తారని.. ప్రతిరోజు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మీడియా ద్వారా మాట్లాడతారన్నారు. ప్రజాసమస్యలపైనా, ప్రభుత్వ వైఫల్యాలపైనా ప్రశ్నిస్తారని తెలిపారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని..కానీ కౌంటర్కు స్పీకర్ సమాధానం ఇవ్వలేదన్నారు జగన్. కోర్టు నుంచి వచ్చిన సమన్లు కూడా స్పీకర్ తీసుకోలేదని.. అసెంబ్లీలో ఉండే ఏకైక ప్రతిపక్షం వైఎస్సార్సీపీ మాత్రమే అన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడంలేదని.. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు. అలా గుర్తించినప్పుడే ప్రతిపక్ష నేతకు మాట్లాడటానికి అవకాశాలు వస్తాయన్నారు. ప్రతిపక్ష నేతగా సమయం ఇవ్వాల్సి వస్తుందనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నారు. 40 శాతం ఓట్ షేర్ సాధించిన పార్టీని ప్రతిపక్షపార్టీగా గుర్తించకపోవడం దారఉమన్నారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు. అసెంబ్లీలో ప్రశ్నలు వేసినట్లుగానే.. మండలిలో కూడా అధికార పక్షాన్ని ప్రశ్నించాలన్నారు. పూర్తి వివరాలు, ఆధారాలు, సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. ఈ వివరాలన్నింటినీ కూడా ఎమ్మెల్సీలకు పంపిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa