ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా, ఏపీ బడ్జెట్పైనా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇన్ని రోజులు పాటూ.. బడ్డెట్ పెట్టకుండా సాగదీసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం.. చివరకు ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. ఏపీ బడ్జెట్ గురించి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబు తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ప్రవేశపెడితే మోసాలు బయటపడతాయని తెలిసే ఇన్నిరోజులూ బడ్జెట్ పెట్టకుండా సాగదీశారని వైఎస్ జగన్ ఆరోపించారు. బడ్జెట్ పత్రాలే చంద్రబాబును డ్రామా ఆర్టిస్ట్ అని తేల్చాయన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. యాక్టింగ్లో చంద్రబాబు నాయుడు.. మాజీ సీఎం ఎన్టీఆర్నే మించిపోయారంటూ ఎద్దేవా చేశారు. దానవీర శూరకర్ణ సినిమాలో నందమూరి తారక రామారావు చేసిన నటన కంటే.. చంద్రబాబే ఎక్కువ నటించారని జగన్ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో ఏపీ శ్రీలంకలా మారుతోందంటూ ఎన్నికలకు ముందు కూటమి నేతలు ప్రచారం చేశారన్న వైఎస్ జగన్.. వైసీపీ హయాంలో ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లకు చేరుకున్నట్లు గోబెల్స్ ప్రచారం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్తోనూ అబద్ధాలు చెప్పించారన్న వైఎస్ జగన్.. సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టేందుకే ఈ ప్రచారం చేశారన్నారు. ఏపీలో తాము వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రం అప్పు రూ.3 లక్షల 13 వేల కోట్లుగా ఉందన్న వైఎస్ జగన్.. 2024లో తాము దిగిపోయే సమయానికి ఏపీ అప్పులు 6 లక్షల 46 వేల కోట్లు అని చెప్పారు. టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు 19 శాతం పెరిగితే.. వైసీపీ పాలనలో 15 శాతం మాత్రమే పెరిగాయన్న జగన్.. అప్పురత్న బిరుదు ఎవరికి ఇవ్వాలని ప్రశ్నించారు.
మరోవైపు ఏపీలో పెట్టుబడులు విషయంపైనా వైఎస్ జగన్ స్పందించారు. చంద్రబాబు ప్రతిదానికీ బిల్డప్ ఇస్తున్నారన్న వైఎస్ జగన్.. తమ హయాంలోనే అదానీ, అంబానీలు పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతిని వైఎస్ జగన్ ప్రస్తావించారు. వైసీపీ హయాంలో 8 కీలక ప్రాజెక్టులకు అడుగులు ముందుకు పడ్డాయన్న వైఎస్ జగన్.. వాటిని కొనసాగించకుండా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినవారిని కూడా బెదరగొడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే సజ్జన్ జిందాల్ ప్రస్తావన తీసుకువచ్చారు వైఎస్ జగన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa