ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తై.. ప్రభుత్వాలు మారిపోయాయి. వైసీపీ ప్రభుత్వం దిగిపోయి టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావొస్తుంది. ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించి, పాలనను పరుగులు తీయిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా.. కొంతమంది సిబ్బంది తీరు మారడం లేదు. నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. కాకినాడ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. కాకినాడ నగరంలోని ఓ మీసేవ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోతో సర్టిఫికేట్లు జారీ చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ ధ్రువపత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అధికారులు తప్పు గ్రహించారు. కారకులైన వారిపై చర్యలకు ఉపక్రమించారు.
అసలు వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామానికి చెందిన లోహిత్ సాయికుమార్ అనే వ్యక్తికి ఈబీసీ సర్టిఫికేట్ అవసరం వచ్చింది. దీంతో కాకినాడలోని గొడారిగుంట శాంతినగర్లో ఉన్న ఓ మీసేవ కేంద్రంలో ఈబీసీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అన్నీ పత్రాలు సక్రమంగా ఉండటంతో నవంబర్ పదో తేదీన లోహిత్ సాయికుమార్కు ఈబీసీ సర్టిఫికేట్ మంజూరు అయ్యింది. కాకినాడ రూరల్ తహశీల్దార్ లక్ష్మీనరసకుమారి డిజిటల్ సంతకంతో ఈబీసీ సర్టిఫికేట్ జారీ చేశారు. అయితే ఈ సర్టిఫికేట్ను వైఎస్ జగన్ చిత్రంతో ఇవ్వడమే వివాదాస్పమైంది. మీసేవ నిర్వాహకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ చిత్రంతో కూడిన ధ్రువపత్రం జారీ చేశారు.
అయితే టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ధ్రువపత్రాల మీద ముఖ్యమంత్రి ఫోటోలు తొలగించాలని ఆదేశించారు. కేవలం ప్రభుత్వ రాజముద్రతోనే సర్టిఫికేట్లు మంజూరు చేస్తున్నారు. అయితే కాకినాడలో మాజీ సీఎం జగన్ ఫోటోతో సర్టిఫికేట్లు ఇవ్వడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో స్థానిక తహసీల్దార్ లక్ష్మీనరసకుమారి స్పందించారు. పొరపాటును గుర్తించామన్న ఎమ్మార్వో.. మీసేవ కేంద్రం నిర్వాహకుడిని పిలిపించి విచారించినట్లు చెప్పారు. అయితే తన వద్దనున్న కొత్త సర్టిఫికేట్లు అయిపోవడంతో పాత దానిపై ప్రింట్ తీసి ఇచ్చినట్లు మీసేవ నిర్వాహకుడు చెప్పాడని ఎమ్మార్వో తెలిపారు. మీసేవ నిర్వాహకుడు తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు కాకినాడ రూరల్ తహశీల్దార్ లక్ష్మీనరసకుమారి వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa