ఆంధ్రప్రదేశ్ వాసులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెట్రో కల తీరనుంది. విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులకు గతంలో ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై ముందడుగు మాత్రం పడటం లేదు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం వాసుల మెట్రో కలను సాకారం చేసేలా విశాఖ మెట్రోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ విషయమై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. బుధవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖపట్నం ఎమ్మెల్యేలు ఈ విషయమై మంత్రిని ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి నారాయణ.. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుల విషయంలో వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్న మంత్రి నారాయణ.. టీడీపీ కూటమి ప్రభుత్వంలో త్వరలోనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కలకత్తా మోడల్ తరహాలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం జరపాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కలకత్తా మెట్రో రైలు ప్రాజెక్టు తరహాలో నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరించేలా, ప్రాజెక్టును రైల్వేశాఖకు అప్పగించేలా ప్రతిపాదనలు చేశామన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాశారని చెప్పారు.
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుపై సమగ్ర ప్రణాళికను రూపొందించి కేంద్రానికి పంపించామన్న మంత్రి నారాయణ.. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 76.90 కి.మీ. మేర రెండు ఫేజ్లలో నాలుగు కారిడార్లలో విశాఖపట్నం మెట్రో నిర్మాణం చేపడతామని ప్రకటించారు. మొదటి దశలో 46.23 కిమీ మేర మూడు కారిడార్లలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేస్తామన్న నారాయణ.. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకూ 34.4 కి.మీ మేర మొదటి కారిడార్.. గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకూ 5.07 కిమీ మేర రెండో కారిడార్ ఉంటుందన్నారు.
ఇక మూడో కారిడార్లో తాటిచెట్ల పాలెం నుంచి చిన వాల్తేరు వరకూ 6.75 కిమీ మేర ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. 46.23 కిమీ మేర 42 స్టేషన్లతో నిర్మించే మొదటి దశ ప్రాజెక్టుకు 11,498 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.రెండో దశలో కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ 30.67 కిమీ మేర మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. రెండో దశలో మొత్తం 12 స్టేషన్లు ఉండనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa