మైనర్ బాలికను ప్రేమించానని.. ఆమెను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు ఆదివారం హల్చల్ చేశాడు. సెల్టవర్ ఎక్కి బెదిరించాడు. చివరకు పోలీసులు అతన్ని కిందకు దించి నిందితునిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లి దాడితల్లి కాలనీకి చెందిన సింగారు అజయ్ అనే యువకుడు డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సీతానగరం ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు బాలిక తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆ యువకుడు ఆత్మహత్యా ప్రయత్నం చేయాలనుకున్నాడు.
ఆదివారం సాయంత్రం గొల్లపల్లిలోని సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయకపోతే టవర్పై నుంచి దూకేస్తానని బెదిరించాడు. విషయం తెలిసి ఇన్చార్జి సీఐ నారా యణరావు, ఎస్ఐ రమేష్లు అక్కడకు చేరుకుని అజయ్ను ఒప్పించేందుకు ప్రయత్నించారు. అమ్మాయి వచ్చి అంగీకారం తెలిపితేనే టవర్ దిగుతానని మొండికేశాడు. దీంతో పోలీసులు ఆ బాలికను తీసుకొచ్చారు. అనంతరం కిందికి దిగిన అజయ్ను పోలీసులు పోలీసు స్టేషన్కు తరలించారు. విచారణ జరిపిన తరువాత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం అజయ్ భవాని మాలధారణలో ఉన్నాడు. ఎస్ఐ రమేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa