ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో సౌర విద్యుత్ ప్రోత్సాహనికి తీసుకుంటున్న చర్యలు, ఉన్న అవకాశాల గురించి చర్చించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకం గురించి కూడా చంద్రబాబు అధికారులతో చర్చించారు. అలాగే గవర్నమెంట్ ఆఫీసుల్లో సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటు గురించి కూడా వారితో చర్చించారు. కేంద్రం అమలు చేస్తున్న కుసుమ్ పథకంతో పాటుగా.. సోలార్ విలేజ్ అంశాలు సైతం సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయి. ఇక వందశాతం సోలార్ విద్యుత్ సరఫరాకు పైలెట్ ప్రాజెక్టుగా సీఎం చంద్రబాబు నాయుడు.. తన సొంత నియోజకవర్గమైన కుప్పం ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టుగా కుప్పంలో వందశాతం సోలార్ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోనున్నారు.
మరోవైపు సోలార్ విద్యుత్ ఉపయోగం ద్వారా వచ్చే రోజుల్లో లాభాలు ఉంటాయని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం కొంతమేర పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పటికీ భవిష్యత్తులో రాష్ట్ర ఖజానా మీద భారం తగ్గుతుందని ఆలోచిస్తున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ప్రభుత్వం 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తోంది. దీనికయ్యే ఖర్చును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే డిస్కంలకు చెల్లిస్తోంది. అయితే వీరిని సోలార్ విద్యుత్ వైపు మళ్లిస్తే ప్రభుత్వ ఖజానాపై కాస్త మేర భారం తగ్గుతుందని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ పథకం కింద.. సోలార్ విద్యుత్ ఏర్పాట్లు చేసుకునేవారికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి. కొంతమేరకు లబ్ధిదారుడు భరిస్తే.. మిగతా మొత్తాన్ని సబ్సిడీ కింద అందిస్తున్నారు.
అయితే ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల లబ్ధిదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఆలోచన చేస్తు్న్నారు. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ కాకుండా ఇలా సోలార్ విద్యుత్ వైపు నడిపించడం ద్వారా మొదట్లో కాస్త ఖర్చు అయినప్పటికీ.. వచ్చే రోజుల్లో ఆదా అవుతుందనేది ప్రభుత్వం ఆలోచన. ఇలా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకున్న లబ్ధిదారులు.. తమ ఇంటి అవసరాలకు వాడుకున్నది పోనూ.. మిగతా సోలార్ విద్యుత్ను డిస్కంలకు విక్రయించే అవకాశం ఉంది. ఒక్కసారి సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేసుకుంటే పాతికేళ్లు ఇబ్బంది ఉండదు. ఈ ప్రతిపాదనలపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa