తనను కస్టోడియల్ టార్చర్ చేసిన సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. విజయ్ పాల్ను అరెస్ట్ చేయడం చాలా సంతోషంగా అనిపించిందని రఘురామ తెలిపారు. రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ఎన్నో దందాలు చేశారని, నేడు ఆయన పాపం పండిందని డిప్యూటీ స్పీకర్ అన్నారు. తనను టార్చర్ చేసిన కేసులో పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినా విజయ్ పాల్ తెలియదని క్రిమినల్లాగా సమాధానాలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా, రఘురామ కేసులో నిన్న(మంగళవారం) ఒంగోలు పోలీసులు విజయ్ పాల్ను అరెస్టు చేశారు.కస్టోడియల్ టార్చర్లో అసలు కుట్రదారు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ అని రఘురామ చెప్పారు.
అందరూ కలిసి కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని శిక్షించడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని రఘురామ అన్నారు. ప్రధాన నిందితుడు పీవీ సునీల్ కుమార్.. తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వ్యక్తని ఆయన ధ్వజమెత్తారు. పీవీ సునీల్ కుమార్కి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాలని రఘురామ కోరారు. అతను దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ పోలీసులపై ఉందని అన్నారు. సునీల్ కుమార్, విజయ్ పాల్ అంతా ఓ ముఠా అని మండిపడ్డారు రఘురామ. తనను టార్చర్ చేసిన వారికి న్యాయస్థానంలో తప్పకుండా శిక్షపడుతుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ-5గా సూపరింటెండెంట్ ప్రభావతి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేసినట్లు రఘురామ చెప్పారు. ఆమె మెడికల్ రిపోర్ట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని ఆయన తెలిపారు. ఈ కేసులో అందరినీ శిక్షించడానికి ఎక్కువ సమయం పట్టదని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన చెప్పారు. అలాగే ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ సైతం కోరినట్లు రఘురామ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa