ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపడుతామని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ పోర్టులో అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తూ పట్టుబడిన రేషన్ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఢిల్లీ పర్యటన తర్వాత మంగళగిరికి చేరుకున్న పవన్ కళ్యాణ్.. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై దృష్టిసారించారు. పీడీఎస్ పథకం ద్వారా పేదలకు అందించే బియ్యాన్ని వారికి అందకుండా.. విదేశాలకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచే ఈ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని.. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భారీగా ఈ అక్రమ రేషన్ బియ్యం దందా సాగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం స్వయంగా అక్కడికి వెళ్లడం గమనార్హం.
కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చానని.. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఎప్పటి నుంచో చెబుతున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఇలాంటి ఘటనలను పట్టికోవాలి కదా అంటూ ఎమ్మెల్యే కొండబాబు, పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత భారీగా బియ్యం దేశం దాటి వెళ్తుంటే.. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతీసారి తమ లాంటి వాళ్లు వచ్చిన ఆపితేగానీ.. ఇలాంటి అక్రమ రవాణా ఆపలేరా అంటూ ఫైర్ అయ్యారు. పోర్టు అధికారులు సరిగా ఉంటే రేషన్ బియ్యం అక్రమ రవాణా ఎలా జరుగుతుందని అధికారులపై మండిపడ్డారు. ఇక అదే సమయంలో ఎమ్మెల్యే కొండబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. పవన్ కొంత అసహనం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గతంలో రాష్ట్రంలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయ్యారని చెబితే వెటకారంగా మాట్లాడారని.. అదే విషయం కేంద్రం చెప్పిన తర్వాత అందరికీ అర్థమైందని పేర్కొన్నారు. కూటమి పాలన పగ, ప్రతీకారాలతో ఉండదని.. అలా అని తప్పులు చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరికలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్.. వివిధ చోట్ల తనిఖీలు నిర్వహించి 51వేల టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారని తెలిపారు. కాకినాడ పోర్టుకు రోజుకు 1100 లారీలు వస్తాయని.. ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టుల్లో కాకినాడ చాలా ముఖ్యమైందని పేర్కొన్న పవన్.. కానీ ఇక్కడ కేవలం 16 మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉన్నారని చెప్పారు.
ఈ సందర్భంగా రేషన్ మాఫియా వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. మొత్తం ఈ మాఫియా నెట్వర్క్ను అడ్డుకోవాలన్నారు. రేషన్ బియ్యం పేదప్రజలకు మాత్రమే అందాలని పేర్కొన్నారు. కిలో రేషన్ బియ్యానికి సుమారు రూ.43 ఖర్చు అవుతోంటే.. కొందరు వ్యాపారులు వాటితో రూ.వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. కిలో రేషన్ బియ్యాన్ని విదేశాలకు రూ.73కు అమ్ముతున్నారని తెలిసిందని చెప్పారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని వెల్లడించారు. సీఐడీ, సీబీఐ ఎవరితో విచారణ చేయించాలో త్వరలో చెబుతామని.. కాకినాడ యాంకర్ పోర్టు పూర్తిగా ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందని.. ఇక్కడి నుంచి కేవలం సరకులు మాత్రమే రవాణా జరగాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa