ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహా సీఎం ఎంపికలో ట్విస్ట్.. మహాయుతి మీటింగ్‌ రద్దు, సొంతూరికి వెళ్లిన ఏక్‌నాథ్ షిండే

national |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2024, 10:43 PM

మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా.. సీఎం పదవి చిక్కుముడి మాత్రం వీడటం లేదు. కూటమి నేతలు, బీజేపీ హైకమాండ్ ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నా.. ముఖ్యమంత్రి ఎవరు అనేది మాత్రం తేలడం లేదు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మహాయుతి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌‌ భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత మహారాష్ట్ర సీఎం ఎవరు అనేది ప్రకటిస్తారని అంతా భావించినా.. అలాంటిదేమీ జరగలేదు. అయితే ఈ సమావేశంలో సానుకూల ఫలితాలు వెల్లడైనట్లు ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు. ఇక ముంబైలో మహాయుతి కూటమి నేతలు భేటీ అయి.. తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.


అయితే అనూహ్యంగా మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, షిండే శివసేన నేత ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌ల మధ్య ముంబైలో కీలక సమావేశం జరగాల్సి ఉండగా.. అది చివరి నిమిషంలో రద్దు అయింది. అందుకు కారణం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అని తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండే.. అత్యవసరంగా తన సమావేశాలు అన్నీ రద్దు చేసుకుని.. సతారాలోని తన స్వంత గ్రామానికి వెళ్లినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే మహాయుతి కూటమి భేటీతోపాటు.. షిండే శివసేన భేటీ కూడా రద్దయ్యాయి. ఏక్‌నాథ్ షిండే తన గ్రామం నుంచి వచ్చిన తర్వాత సమావేశాలు జరుగుతాయని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చర్చలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని.. అందుకే సమావేశాలు రద్దు చేసుకుని ఆకస్మిక పర్యటనకు వెళ్లారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.


ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనే నిర్ణయాన్ని బీజేపీ హైకమాండ్‌కు వదిలేసినట్లు ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేయడంతో.. ఇక దేవేంద్ర ఫడ్నవీస్‌కే సీఎం బాధ్యతలు దక్కడానికి మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులపై ఏకాభిప్రాయం ఉందని.. అయితే కొన్ని మంత్రి పదవులపైనే మహాయుతి కూటమి మధ్య తేలడం లేదని సంబధిత వర్గాలు చెబుతున్నాయి.


గతంలోలాగానే ఒక ముఖ్యమంత్రి ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ సీఎం పదవిపై ఏక్‌నాథ్ షిండే ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇదివరకే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి చేయడం బాగుండదని.. ఎమ్మెల్యే, శివసేన అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ పేర్కొన్నారు. ఇక బీజేపీ హోంశాఖను తీసుకునే అవకాశం ఉండగా.. అజిత్ పవార్‌కు తిరిగి ఆర్థిక శాఖను అప్పగించనున్నారు. ఇక షిండే శివసేనకు పట్టణాభివృద్ధి, ప్రజాపనుల శాఖలు దక్కే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్రలో 41 మంత్రి పదవులు ఉండగా.. అందులో బీజేపీకి 22 కేబినెట్‌ బెర్త్‌లు దక్కే అవకాశం ఉంది. మరోవైపు.. శివసేనకు 12, ఎన్‌సీపీకి 9 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇక మహారాష్ట్ర కొత్త సీఎం డిసెంబరు 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com