నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుపాను తీరాన్ని తాకింది. తమిళనాడు, పుదుచ్చేరి తీరంలో కారైక్కాల్-మహాబలిపురం మధ్య ఈ తుపాను ముందు భాగం భూభాగంపైకి చేరుకుంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా పయనిస్తోందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తుపాను తీరాన్ని దాటే సమయంలో దాదాపు మూడ్నాలుగు గంటల పాటు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఇది చెన్నైకి దక్షిణంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, గడచిన 6 గంటలుగా గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని ఐఎండీ వివరించింది.తుపాను ప్రభావంతో ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ముందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.