ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబర్ 5న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం.. సీఎం సీటుపై వీడని ఉత్కంఠ, పీఠం ఎవరిదో

national |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 09:02 PM

ఓ వైపు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేది ఎవరు అనేది నిర్ణయించకముందే.. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సీఎం పీఠంపై చిక్కుముడి వీడకముందే.. ప్రభుత్వ ఏర్పాటు తేదీ ఖరారు చేసినట్లు సమాచారం. ముందుగా.. డిసెంబర్ 2వ తేదీన మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని వార్తలు రాగా.. తాజాగా డిసెంబర్ 5వ తేదీకి మారినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మహాయుతి కూటమిలోని బీజేపీ, షిండే శివసేన నేతల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు.. మహాయుతి కూటమి సమావేశాన్ని రద్దు చేసుకుని.. ఏక్‌నాథ్ షిండే తన సొంతూరికి వెళ్లడంతో.. కూటమి సమావేశం ఆగిపోవడంతో ఇంకా మహా ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా రేసులోకి మరికొంత మంది పేర్లు రావడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా రసవత్తరంగా మారాయి.


డిసెంబరు 5వ తేదీన మహారాష్ట్రలో మహాయుతి నేతృత్వంలో నూతన సర్కారు కొలువుదీరే అవకాశం ఉందని బీజేపీకి చెందిన ఓ సీనియర్‌ నేత వెల్లడించారు. ఇక ముఖ్యమంత్రి రేసులో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు వరుసలో ఉన్నారని.. ఆయనకే ఈ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఫడ్నవీస్‌ గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారని.. ఈ నేపథ్యంలోనే మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారని తెలిపారు. ఇక దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో డిసెంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అంతకు ముందే బీజేపీ శాసనసభా పక్ష నేతను ఎంచుకునేందుకు డిసెంబర్ 2వ తేదీన సమావేశం నిర్వహిస్తామని ఆ నేత స్పష్టం చేశారు.


మహారాష్ట్ర సీఎం రేసులో ఉన్న షిండే శివసేన నేత ఏక్‌నాథ్ షిండే.. ముఖ్యమంత్రి పదవి ఎవరికి అనేది బీజేపీ హైకమాండ్‌కు వదిలేయడంతో.. బీజేపీకి చెందిన నేతలకే పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనాయకత్వం దేవేంద్ర ఫడ్నవీస్‌ వైపే మొగ్గు చూపుతుండగా.. మురళీధర్‌ మోహోలే, వినోద్ తావ్డే, రాధాకృష్ణ విఖే-పాటిల్ వంటి వారి పేర్లను కూడా బీజేపీ హైకమాండ్ పరీక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గానూ.. 230 కైవసం చేసుకుని తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే గత శనివారం ఫలితాలు వెలువడినా.. ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఎవరు అనేదే తేలడం లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 132 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా.. షిండే శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com