మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెల్లడై వారం దాటినా.. ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు తేలడం లేదు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిపై ఎవరు కూర్చుంటారు అనే ఉత్కంఠ కేవలం మహారాష్ట్ర ప్రజల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లతో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా.. ఢిల్లీలో చర్చలు జరిపినప్పటికీ.. ఎవరు ముఖ్యమంత్రి అనేది తేలలేదు. అంతేకాకుండా ముంబైలో మహాయుతి కూటమి సమావేశమై.. ముఖ్యమంత్రి ఎవరు అనేది తేలుస్తామని స్వయంగా ఏక్నాథ్ షిండే చెప్పినా.. సమావేశం జరగలేదు, సీఎం ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలోనే ఈ భేటీని రద్దు చేసుకుని.. ఆకస్మికంగా సొంతూరికి వెళ్లిన షిండే.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర ప్రజలు ఆశించిన విధంగా మహాయుతి కూటమి ప్రభుత్వ పాలన అందించేందుకు మరోసారి సిద్ధంగా ఉన్నామని ఏక్నాథ్ షిండే వెల్లడించారు. ప్రజల నిర్ణయంతో మహాయుతి కూటమికి బాధ్యత మరింత పెరిగిందని గుర్తు చేశారు. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనేది బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బీజేపీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని మరోసారి షిండే స్పష్టం చేశారు. ప్రభుత్వానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమి చర్చలు జరుపుతోందని.. ఈ విషయంలో కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తేల్చి చెప్పారు. బీజేపీ, శివసేన, ఎన్సీపీ కలిసి ఒక అభిప్రాయానికి రానున్నాయని షిండే వెల్లడించారు.
ఇక సీఎం ఎంపిక కోసం ముంబైలో మహాయుతి కూటమి నేతల మధ్య జరగాల్సిన కీలక సమావేశం రద్దు తర్వాత ఏక్నాథ్ షిండే తన స్వగ్రామానికి వెళ్లడంపై అనేక ఊహాగానాలు చెలరేగాయి. ఇదే ప్రశ్నను మీడియా షిండేను అడగ్గా.. తాను తరచూ స్వగ్రామానికి వెళ్లి వస్తుంటానని తెలిపారు. అయితే షిండేకు స్వల్ప అనారోగ్యం కారణంగా సొంతూరికి వచ్చారని.. త్వరలో ముంబైకి వెళ్తారని ఆయన సన్నిహితులు చెప్పారు.
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈనెల 5వ తేదీన ఉంటుందని ఇప్పటికే బీజేపీ, శివసేన నేతలు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఎవరనేది వెల్లడించకపోవడం తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. ఇక బీజేపీ మొదటినుంచి దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి చేయాలని భావిస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి మురళీధర్ మోహోల్తోపాటు మరికొందరు పేర్లు తెరపైకి వచ్చాయి. మరోవైపు.. ఫలితాలు వెలువడి 10 రోజులు కావస్తున్నా ముఖ్యమంత్రి ఎవరు అని ప్రకటించకపోవడంపై మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యమంత్రి పేరు ప్రకటించడంలో చేస్తున్న ఆలస్యం మహారాష్ట్రకు అవమానం అని.. శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేత ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa