ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. ఇటీవల రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశం గురించి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ షర్మిల.. ఈసారి గంగవరం పోర్టు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంతో, టీడీపీ కూటమి సర్కారును పోలుస్తూ ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్ అయితే.. మౌనంగా ఉండటం టీడీపీ కూటమి సర్కారు ట్రెండ్ అంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు.
"వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్గా మారితే.. వాటిని చూసి మౌనం వహించడం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కార్ ట్రెండ్గా పెట్టుకుంది. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా గత ప్రభుత్వం ధారాదత్తం చేసిన ఏ ఒక్క ఆస్తిపై, కనీసం ఒక్క చర్య కూడా లేదు. విచారణకు సైతం దిక్కులేదు. రాష్ట్రంలో కాకినాడ పోర్టు ఒక్కటే కాదు..కృష్ణపట్నం పోర్టును గుంజుకున్నారు. ప్రభుత్వ ఆధీనంలో అత్యధిక లాభాలు గడించే గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారు." అని వైఎస్ షర్మిల విమర్శించారు.
" ఏపీని పోర్టులకు హబ్గా మార్చే పాలసీలు సరే. మరి గంగవరం పోర్ట్ సంగతేంటి? ప్రతి ఏటా దాదాపు రూ.2వేల కోట్ల లాభాలు గడించే పోర్టును గత వైసీపీ ప్రభుత్వం 2021లో అదానీకి రాసి ఇచ్చింది. నికర ఆర్థిక నిల్వలతో పాటు.. రూ.9వేల కోట్ల విలువజేసే 10 శాతం వాటాను కేవలం రూ.640 కోట్లకు పుట్నాల కింద అమ్మారు. 2,800 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను అదానీకి కట్టబెట్టారు. బీఓటీ కింద ఇంకో 15 ఏళ్లలో పూర్తిగా ప్రభుత్వపరం అవ్వాల్సిన పోర్టు అది." అంటూ షర్మిల విమర్శించారు.
"అదానీకి కట్టబెట్టేటప్పుడు ఎలాంటి టెండర్లు లేవు. కళ్ళు మూసీ తెరిచేలోగా అన్ని అనుమతులు ఇచ్చేశారు. మిగతా పోర్టుల అభివృద్ధికి ఆ నిధులు ఉపయోగం అని బుకాయించారు. ప్రతిపక్షంలో ఉండగా గంగవరం పోర్టుపై చెప్పిన మీ మాటలకు,ఇచ్చిన హామీలకు, ఇప్పుడు అమలు చేస్తున్న విధానాలకు ఎంతమాత్రం పొంతన లేదు. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న వాటాను వెనక్కు తీసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను డిమాండ్ చేస్తున్నాం" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa