ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బరిమలలో హీరోకు వీఐపీ దర్శనం.. కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

national |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 07:45 PM

కేరళలోని శబరిమల ఆలయంలో జరుగుతున్న మండల-మకరవిళక్కు పూజలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు.. శబరిగిరులకు చేరుకుని.. అయ్యప్పను దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే శబరిమల భక్తులతో పోటెత్తుతోంది. గతేడాది తోపులాటలు, తొక్కిసలాటలు, భక్తుల రద్దీ నేపథ్యంలో ఈసారి రోజుకు 80 వేల మందికి దర్శనాలు కల్పిస్తూ.. ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన తమ దృష్టికి రావడంతో కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నటుడికి శబరిమలలో ప్రత్యేక దర్శనం కల్పించడం పట్ల ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులతోపాటు కేరళ పోలీసులపై ఆగ్రహానికి గురైంది.


మలయాళ నటుడు దిలీప్‌కు శబరిమలలోని అయ్యప్ప క్షేత్రంలో గురువారం వీఐపీ దర్శనం కల్పించడాన్ని కేరళ హైకోర్టు తప్పుపట్టింది. ఈ సందర్భంగా ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే హీరో దిలీప్‌కు వీఐపీ అయ్యప్ప దర్శనం కల్పించడంతో.. ఆ సమయంలో శబరిమలకు వచ్చిన అయ్యప్ప భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అక్కడ గంటల తరబడి వేచి చూడలేక కొందరు భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కేరళ హైకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది.


వేలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చినపుడు.. హీరోను ఎక్కువసేపు ఆలయంలో ఉండేందుకు ఎలా అనుమతిచ్చారని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డును కేరళ హైకోర్టు ప్రశ్నించింది. హీరో ఇలా చాలాసేపు దర్శనం చేసుకోవడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు సహా ఇతర భక్తులు గంటల తరబడి లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొంది. ఆలయ అధికారులే ఇలా ప్రవర్తిస్తే.. అయ్యప్ప భక్తులు ఎవరికి ఫిర్యాదు చేస్తారని కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


స్పెషల్ దర్శనం అనేది కేవలం రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే వీఐపీ దర్శనం కల్పించాల్సి ఉంటుందని.. ఇతరులకు కల్పించడం నిబంధనలకు విరుద్ధమని ఈ సందర్భంగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుపై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కేరళ పోలీసులు దర్యాప్తు చేపట్టి శనివారంలోగా ఈ విషయానికి సంబంధించిన వీడియో ఫుటేజీ, నివేదికను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు జడ్జిలు జస్టిస్‌ నరేంద్రన్, జస్టిస్‌ మురళీ కృష్ణలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ సమయంలోనే హీరో దిలీప్‌ను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని వస్తున్న డిమాండ్లను పరిశీలిస్తామని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa