ఆలయం అంటేనే హుండీ, కానుకలు, విరాళాలు ఉంటూనే ఉంటాయి. ఇక ఒకసారి ఏదైనా కోరిక కోరుకున్న వారు అది నెరవేరితే.. భారీగా ఆ దేవుడికీ, దేవతకు కానుకలు, విరాళాలు ప్రకటిస్తూ ఉంటారు. ఇలా విరాళాలతో వార్తల్లోకి ఎక్కిన ఆలయాలు ఎన్నో ఉంటాయి. ఇక వడ్డీ కాసుల వాడు, తిరుమల వెంకన్న హుండీ ఆదాయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. నిత్యం రూ.3 కోట్లకు పైగానే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రాజస్థాన్లోని శ్రీకృష్ణుడి ఆలయంలో హుండీని లెక్కించిన అధికారులకు బంగారం, డబ్బు కళ్లు చెదిరే రీతిలో కనిపించింది. అవన్నీ లెక్కించిన ఆలయ అధికారులు.. వాటి వివరాలను వెల్లడించారు.
రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ శ్రీకృష్ణుడి ఆలయ హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. 2 నెలల తర్వాత తాజాగా హుండీ ఆదాయ లెక్కింపు చేపట్టగా.. అందులో బంగారం, వెండి, నగదు సహా ఇతర వస్తువులు ఉన్నట్లు వెల్లడించారు. కిలో బంగారు బిస్కెట్లు, రూ.23 కోట్లకు పైగా విలువైన నగదు కానుకలు వచ్చాయని ఆలయ అధికారులు చెప్పారు. భక్తులు.. శ్రీకృష్ణ భగవానుడికి బంగారు బిస్కెట్లు, వెండి కళాఖండాలు, వెండి పిస్టల్, వేణువులు సహా మరిన్ని ప్రత్యేక వస్తువులను ప్రేమతో కానుకలుగా సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఆ ఆలయం నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన ఆదాయంలో ఇదే అతి పెద్ద మొత్తం అని ఆలయం అధికారులు స్పష్టం చేశారు.
అయితే శ్రీకృష్ణుడి ఆలయానికి భారీగా విరాళాలు రావడంతో వాటిని దశల వారీగా అధికారులు లెక్కించే పనిలో పడ్డారు. ఇప్పటివరకు రూ.23 కోట్లకు పైనే నగదు విరాళాలు సమకూరినట్లు వెల్లడించారు. ఆలయ హుండీ లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని వివరించారు. బంగారం, వెండి వస్తువులు, హుండీల నుంచి సేకరించిన వివిధ వస్తువులను తూకం వేసి వాటి విలువను లెక్కిస్తున్నట్లు చెప్పారు. చిత్తోర్గఢ్ - ఉదయ్పుర్ జాతీయ రహదారిపై ఉండే సన్వాలియా సేథ్ అనే ఈ ఆలయం.. చిత్తోర్గఢ్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa