గత వారం రోజుల నుంచి సిరియాలో తిరుగుబాటుదారులు ఒక్కో ప్రాంతాన్ని చేజిక్కుంచుకుంటూ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఆదివారం సిరియా రాజధాని డమాస్కన్ను చేజిక్కుంచుకున్నారు. బషర్ అల్ అసద్ను పీఠం నుంచి దించి అబు మహ్మద్ అల్ జోలానీ అధికారాన్ని దక్కించుకున్నారు. తిరుగుబాటుదారుల చేతుల్లోకి దేశం వెళ్లడంతో అసద్ దేశం విడిచి పారిపోయారు. ఇదే అదునుగా చేసుకున్న ఇజ్రాయిల్ సిరియాపై దాడులు ప్రారంభించింది. మరోవైపు అంతర్యుద్ధం కూడా సాగుతుండడంతో దేశ ప్రజలంతా ప్రాణాలు అరచేత పెట్టుకుని బతుకుతున్నారు.
సిరియా పరిస్థితులను ప్రతిక్షణం పరిశీలిస్తున్న భారత్... అక్కడ ఉన్న భారత పౌరులను సేఫ్గా స్వదేశానికి తెచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా భారత విదేశాంగ శాఖ అక్కడ ఉన్న 75 మంది ఇండియన్లను సిరియా నుంచి భారత్కు తరలించింది. ప్రతీక్షణం భద్రతా పరిస్థితులను అంచనా వేస్తూ.. డమాస్కన్, బీరూట్లోని భారత రాయబార కార్యాలయాల సమన్వయంతో వారిని తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
సిరియా నుంచి తరలించిన 75 మంది భారత పౌరుల్లో.. 44 మంది జమ్మూ కశ్మీర్కు చెందిన వారు ఉన్నట్లు MEA ఎక్స్ వేధికగా వెల్లడించింది. భారతీయ పౌరులందరూ సురక్షితంగా లెబనాన్కు చేరుకున్నారని.. అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా వారంతా స్వదేశానికి తిరిగి వస్తారని స్పష్టం చేసింది. అలాగే విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు.. భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొంది.
అంతేకాకుండా సిరియాలో మిగిలి ఉన్న భారతీయ పౌరులు డమాస్కన్లోని భారత రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని MEA తెలిపింది. ఎప్పటికప్పుడు సిరియా పరిస్థితిని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుందని.. ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పుకొచ్చింది. అలాగే సిరియా పరిస్థితులు మారి శాంతియుతంగా రాజకీయ ప్రక్రియ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
అసద్ దేశం విడిచి పారిపోయినప్పటి నుంచి దేశ ప్రజలంతా తెగ సంబురపడిపోతున్నారు. 50 ఏళ్లుగా కుటుంబ నియంత పాలను చూశామని.. ఇప్పుడు చాలా హాయిగా, సంతోషంగా, స్వేచ్ఛగా బతకవచ్చు అంటూ అక్కడి ప్రజలు చెబుతున్నారు. సిరియా ఇప్పటి నుంచి కొత్త చరిత్రను సృష్టించబోతుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల బదిలీలు త్వరలోనే జరుగుతాయని.. రాజకీయంగా దేశం కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతుందని అశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసద్ కుటుంబంతో సహా ప్రస్తుతం మాస్కోలో ఉన్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా వర్గాలు తెలిపాయి. మానవతా కోమంలోనే ఆయనకు ఆశ్రయం కల్పించనట్లు కూడా అక్కడి మీడియా వర్గాలు స్పష్టం చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa