మన దేశంలో గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లు (ఆన్లైన్ డెలివరీ వర్కర్లు) సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆన్లైన్ ఫుడ్, నిత్యవసరాలు సహా ఇతర ఉత్పత్తుల డెలివరీ, రవాణా సేవల వంటి కీలక రంగాల్లో పని చేస్తున్నారు. వారు ఫలానా సమయం, ఫలానా పని కోసం నియమితులయ్యే తాత్కాలిక ఉద్యోగులు. తాము పని చేయాల్సిన పని గంటలను తామే ఎంపిక చేసుకునే సౌకర్యం వారికి ఉంటుంది. కానీ, ఒక సాధారణ ఉద్యోగికి అందే ప్రయోజనాలేవీ ఉండవు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారికి సైతం సామాజిక భద్రత ప్రయోజనాలు కల్పించాలని యోచిస్తోంది. ఇందుకోసం ఓ పథకాన్ని తీసుకురానుంది.
గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రత అందించాలన్న ఉద్దేశంతో ఓ పథకాన్ని తెస్తున్నట్లు కేంద్రం కార్మిక మంత్రిత్వ శాఖ సెక్రెటరీ సుమితా దావ్రా వెల్లడించారు. గిగ్, ప్లాట్ ఫామ్ సిబ్బంది సంప్రదాయ ఉద్యోగులు కాదని, ప్రస్తుతం వారికి ఎలాంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు లేవన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఇ-కామర్స్, సేవా రంగం మారిందని, ఈ రంగాలకు మరింత ఊతం ఇచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్లో మాట్లాడారు. సామాజిక భద్రతకు సంబంధించి తీసుకొచ్చిన లేబర్ కోడ్లో గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్ల సామాజిక భద్రత గురించి ప్రస్తావించినట్లు గుర్తు చేశారు.
గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లకు సైతం పెన్షన్, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు కల్పించాలని కేంద్రం యోచిస్తోందని, ఇందుకోసం ఓ పథకాన్ని రూపొందిస్తున్నట్లు కేంద్రం కార్మిక మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కొద్ది రోజుల క్రితమే వెల్లడించారు. ఈ క్రమంలో కార్మిక శాఖ సెక్రెటరీ సైతం అదే విషయాన్ని తెలిపారు. దీంతో అతి త్వరలోనే ఆన్లైన్ ప్లాట్ ఫామ్ డెలివరీ వర్కర్ల కోసం కొత్త పథకం అందుబాటులోకి వచ్చేలా కనిపిస్తోంది.
దేశంలో ప్రస్తుతం 65 లక్షల మంది గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లు ఉన్నట్లు నీతి అయోగ్ అంచనా వేసింది. ఈ సంఖ్య 2023 నాటికి 3 కోట్లకు చేరుకోవచ్చని కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. త్వరలో తీసుకురానున్న ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది తయారీ రంగానికి మరింత ఊతం ఇవ్వనుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa