రాజమండ్రి వాసులకు శుభవార్త. రాజమండ్రి నుంచి దేశ రాజధాని ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. అంతకు ముందు ఢిల్లీకి, ముంబైకి వెళ్లాలంటే రాజమండ్రి నుంచి హైదరాబాద్ లేదా విజయవాడ వెళ్లాల్సి ఉండేది. కానీ ఇప్పడు రాజమండ్రి నుంచే ఢిల్లీ, ముంబైకి విమాన సర్వీసులు మొదలయ్యాయి. రాజమండ్రి ఢిల్లీ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అంతకుముందు ఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురందేశ్వరి ఇండిగో విమానంలో చేరుకున్నారు. విమానం రన్ వే మీద ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్పోర్టు సిబ్బంది వాటర్ కెనాల్స్తో విమానానికి స్వాగతం పలికారు. రాజమండ్రి ఢిల్లీ ఇండిగో సర్వీసు రోజు రెండుసార్లు అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు, అలాగే రాత్రి 7 గంటలకు రాజమండ్రి ఢిల్లీ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది.
మరోవైపు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాజమండ్రి నుంచి ఢిల్లీకి విమాన సర్వీసును ప్రారంభించడం ద్వారా దేశ రాజధానిని మన గోదావరి ప్రాంతానికి అనుసంధానం చేశామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ ఎయిర్బస్ ఏ-320 ఇకపై జాతీయ రాజధానిని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని మధ్య ప్రయాణికులకు సేవలు అందిస్తుందని ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, ఈ కొత్త విమానం ఆంధ్రప్రదేశ్కి మెరుగైన కనెక్టివిటీ, ఆర్థిక అవకాశాలు పెంపొందించడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు ప్రస్తుతం ప్రజలు డబ్బు కంటే సమయానికి ఎక్కువ విలువ ఇస్తున్నారని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. అందుకే విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు, ఈ క్రమంలోనే విమాన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే దేశంలో వివిధ ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు కొత్తగా 50 ఎయిర్పోర్టులు నిర్మించనున్నట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి దేశంలో ఉన్న విమానాశ్రయాల సంఖ్య 74 మాత్రమేనన్న రామ్మోహన్ నాయుడు.. ఇప్పుడు దేశంలో ఎయిర్పోర్టుల సంఖ్య 158కి పెరిగిందని తెలిపారు.. త్వరలోనే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నూతన టెర్మినల్ భవనం కూడా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. అనంతరం అదే విమానంలో తిరిగి ఢిల్లీకి బయల్దేరి వెళ్లిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa