గత ఆర్థిక సంవత్సరం 2023- 24 (అసెస్మెంట్ ఇయర్ 2024- 25)కి సంబంధించిన వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్నులు ఇంకా దాఖలు చేయలేదా? ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు జులై 31వ తేదీతోనే ముగిసింది. కానీ, ఇప్పటికీ రిటర్నుల ప్రక్రియ పూర్తి చేయని వారికి చివరి అవకాశం కల్పిస్తోంది ఐటీ చట్టం. డిసెంబర్ 31వ తేదీ వరకు ఆలస్యంగా రిటర్నులు సమర్పించవచ్చు. ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 మధ్య రిటర్నులు ఫైల్ చేయడానికి బిలేటెడ్ రిటర్న్స్ అంటారు. అయితే, కొంత జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మరి ఈ గడువు సైతం దాటితే పరిస్థితి ఏంటి? జైలు శిక్ష పడవచ్చా? అనేది తెలుసుకుందాం.
బిలేటెడ్ రిటర్న్స్ దాఖలు చేస్తున్న ట్యాక్స్ పేయర్ల వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్నట్లయితే రూ. 1000 జరిమానా చెల్లించాలి. అంతకు మించి ఆదాయం ఉన్నట్లయితే రూ. 5 వేల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ గడువు డిసెంబర్ 31వ తేదీ లోపు సైతం ఫైల్ చేయనట్లయితే పన్ను చెల్లింపుదారులు చట్ట ప్రకారం జరిమానా, ఇతర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జైలు శిక్ష సైతం పడేందకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేయడం వల్ల వ్యాపార, మూల ధన నష్టాలను తదుపరి సంవత్సరాలకు సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
బిలేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేసే వారు కచ్చితంగా కొత్త పన్ను విధానంలోనే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. పాత పన్ను విధానంలో చేయడానికి లేదు. దీంతో పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇక డిసెంబర్ 31వ తేదీ లోపు రిటర్నులు ఫైల్ చేయకపోతే ఆ తర్వాత ఆదాయపు పన్ను శాఖను ప్రత్యేకంగా అభ్యర్థించాల్సి వస్తుంది. జాప్యానికి సరైన కారణాలు వివరించాలి. ట్యాక్స్ విభాగం అనుమతిస్తేనే జరిమానా, వడ్డీ చెల్లించి రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. కానీ, ఇది క్లిష్టమైన ప్రక్రియ. అందుకే ఇప్పటికే ఆలస్యం చేయకుండా వెంటనే రిటర్న్స్ ఫైల్ చేయడం మంచిది.