కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ విభాగాన్ని బలోపేతం చేయడంపై దృష్టిసారించాయని, అందులో భాగంగా విశాఖకు ప్రాధాన్యం ఇస్తున్నాయని విశాఖపట్నం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ దానేటి ఝాన్సీ లక్ష్మి పేర్కొన్నారు. కొద్దిరోజుల కిందట బాధ్యతలు స్వీకరించిన ఆమె మాట్లాడుతూ.... తమ విభాగం ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలు, భవిష్యత్తు ప్రణాళిక గురించి వివరించారు. ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియా విభాగాలను కలిపి ఆయుష్గా పేర్కొంటూ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. రీజనల్ కార్యాలయ పరిధిలోని ఆరు జిల్లాల్లో 144 (31 ఎన్ఆర్హెచ్ఎం) డిస్పెన్సరీలు ఉన్నాయన్నారు. వాటిలో 22 డిస్పెన్సరీలను ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా అప్గ్రేడ్ చేసి మెరుగైన సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. మరో ఐదు పంచకర్మ సెంటర్లు ఉన్నాయని వివరించారు.
ఒక్కో డిస్పెన్సరీకి ప్రతిరోజూ కనీసం 50 మంది వరకు రోగులు వస్తుంటారన్నారు. గతంతో పోలిస్తే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. విశాఖను ఆయుష్ హబ్గా మార్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ప్రాజెక్టులను కేటాయిస్తున్నాయన్నారు. విమ్స్లో నేచురోపతి మెడికల్ కాలేజీ ఏర్పాటవుతోందన్నారు. భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని వివరించారు. అదే ప్రాంగణంలో 50 పడకలతో ఆయుష్ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దీనివల్ల ఇన్పేషెంట్లుగా కూడా చేర్చుకుని సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అదేవిధంగా శొంఠ్యాంలో సుమారు ఏడు కోట్ల రూపాయలు వ్యయంతో ఆయుర్వేద ఫార్మసీ, డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని 23 డిస్పెన్సరీల అభివృద్ధికి మూడు లక్షలు రూపాయల చొప్పున నిధులను మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం ఆరు జిల్లాల్లోని డిస్పెన్సరీల్లో పలు కేడర్లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీచేయడం వల్ల మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ ఖాళీలకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa