కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శబరిమల యాత్రికుల బస్సు, కారు ఢీకొట్టిన ఘటనలో నవ దంపతులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కేరళలోని పత్తంనంథిట్ట జిల్లా మురింజకల్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను మల్లశేరికి చెందిన మథాయి ఈపన్, అను, నిఖిల్, బిజు పి.జార్జ్గా గుర్తించారు. అను, నిఖిల్కు నవంబరు 30న వివాహం జరిగింది. అను, నిఖిల్ జంట మలేషియాకు హనీమూన్ కోసం వెళ్లి వస్తుండగా.. వారిని రిసీవ్ చేసుకోడానికి నిఖిల్ తండ్రి మథాయ్ ఈపన్, అను తండ్రి బిజులు తిరువనంతపురం విమానాశ్రయానికి వచ్చారు. అనంతరం వారంతా కారులో బయలుదేరి తమ సొంతూరికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
నిఖిల్ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. పనలూరు-మువట్టుపుజ రహదారిపై ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్యప్ప భక్తులతో వెళ్తోన్న బస్సు.. కారు ఢీకొట్టింది. దీంతో కారులోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలోనే నిఖిల్, జార్జ్, ఈపన్ ప్రాణాలు కోల్పోగా.. అను ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగింది.. బస్సు డ్రైవర్ సహా యాత్రికులు కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుయ్యింది. దీంతో లోపలి చిక్కుకున్నవారిని హైడ్రాలిక్ సాయంతో బయటకు తీశారు.
ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. పోస్ట్మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. నిఖిల్ సోదరి కువైట్లో ఉండటంతో ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియులు నిర్వహించనున్నారు. కాళ్ల పారాణి ఆరక ముందే కొత్త జంట రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. రెండు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. కాగా, తరుచూ ఈ మార్గంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa