ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్మీ చీఫ్ ఆఫీసులో చారిత్రక ‘ఫోటో’ తొలగింపు.. తీవ్ర దుమారం

international |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 08:55 PM

1971 బంగ్లాదేశ్ యుద్ధంలో దాయాది పాకిస్థాన్‌పై విజయానికి గుర్తుగా ఉన్న ఫొటోను.. ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచి తొలగించడం వివాదం రేగుతోంది. డిసెంబరు 16న విజయ్‌ దివస్‌ జరుపుకోండగా.. ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాకిస్థాన్ సైన్యంతో జరిగిన యుద్ధం 1971, డిసెంబరు 16న ముగిసింది. భారత్ దెబ్బకు తలవంచిన పాక్.. లొంగుబాటు ఒప్పందంపై ఆ రోజున సంతకం చేసింది. పాక్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏఏకే నియాజీ.. భారత లెఫ్టినెంట్‌ జనరల్‌ జగ్జిత్‌ సింగ్‌ అరోరా సమక్షంలో సంతకం చేస్తున్న ఫోటోను ఆర్మీ చీఫ్ ఆఫీసులో ఉంచారు.


ఈ చారిత్రక ఫోటో స్థానంలో ‘కర్మ క్షేత్ర’ అనే పేరుతో మరో ఫోటోను ఏర్పాటు చేశారు. భారత్‌, చైనా సరిహద్దుల్లో ఎల్‌ఏసీ వెంబడి ఉండే ప్యాంగాంగ్‌ సరస్సు, యుద్ధ ట్యాంకర్లు, హెలికాప్టర్లు, సైనికులతో భారత యుద్ధ సామర్థ్యాలను చూపేలా ఈ ఫోటో ఉంది. బంగ్లాదేశ్ యుద్దంలో పాకిస్థాన్‌కు చైనా, అమెరికాలు అండగా నిలిచాయి. అమెరికా తన నౌకదళానికి చెందిన సెవెంత్ ఫ్లీట్‌ను పాక్‌కు సాయంగా హిందూ మహా సముద్రంలోకి పంపింది. కానీ, భారత్ సైన్యం పాక్‌కు చుక్కలు చూపించింది. యుద్దం ప్రారంభమైన రెండు వారాల్లోనే దాయాది కాళ్లబేరానికి వచ్చింది. 90 వేల మంది పాక్ సైనికులు తమ ఆయుధాలను వదిలి పారిపోయారు. యుద్ధ ఖైదీలను పూర్తి గౌరవంతో భారత్‌కు అప్పగించారు. సిమ్లా ఒప్పందంలో భాగంగా యుద్ద ఖైదీలను విడుదల చేశారు.


భారత్, పాకిస్థాన్‌ సైనిక అధికారులు సంతకం చేస్తుండగా తీసిన ఫోటోను మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యను మాజీ సైనికాధికారులు తప్పుబడుతున్నారు. వలసపాలన ఆనవాళ్లు తొలగింపు పేరుతో గత కొన్నేళ్లుగా బీజేపీ ప్రభుత్వం చేస్తోన్న అరాచకాల్లో ఇది భాగమని మండిపడుతున్నారు. ఐకానిక్ ఫోటోను తొలగించడం ఘోర తప్పిదమని, ఇది భారత సాయుధ దళాలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇది ఓ చారిత్రక ఫోటో మాత్రమే కాదు.. ఆర్మీ సాధించిన గొప్ప విజయానికి చిహ్నం.. తరతరాలుగా సైనికులకు, అధికారులకు ప్రేరణనిస్తోంది. ఇటువంటి ఫోటోను ప్రభుత్వం ఎందుకు తొలగించిందని నిలదీస్తున్నారు. కాగా, దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ లేదా రక్షణ మంత్రి నుంచి కూడా ఎటువంటి వివరణ రాలేదు. అయితే, మాజీ సైనికాధికారులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ దురద్దేశంతోనే నాటి ప్రధాని ఇందిరా గాంధీ సమర్ధత, నాయకత్వానికి ఉదాహరణగా నిలిచిన ఈ విజయం గుర్తులను తొలగించే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa