ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తుడి ట్వీట్.. 24 గంటల్లో ఉద్యోగి ఉద్యోగం ఊడింది.. నారా లోకేష్ స్పాట్ యాక్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 06:14 PM

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన దృష్టికి వచ్చే సమస్యలను వేగంగా పరిష్కరిస్తుంటారు ఏపీ మంత్రి నారా లోకేష్. సాయం కోరుతూ వచ్చ వినతుల దగ్గర నుంచి .. ఫిర్యాదుల వరకూ అన్నింటిమీద సత్వరమే స్పందిస్తుంటారు. తాజాగా కాణిపాకం ఆలయానికి సంబంధించి ఓ భక్తుడి నుంచి నారా లోకేష్‌కు ఫిర్యాదు అందింది. కాణిపాకం వినాయకుడి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడితో కాణిపాకం ఆలయ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. ఈ విషయంపై సదరు భక్తుడు నారా లోకేష్‌కు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన నారా లోకేష్ విచారణకు ఆదేశించగా.. ఆరోపణలు నిజమని తేలటంతో ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు.


ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కిషోర్ గౌడ్ అనే భక్తుడు శనివారం కాణిపాకం ఆలయానికి వచ్చారు. స్వామివారి దర్శనం కోసం రూ.500 చెల్లించి సాధారణ ఆశీర్వచన టికెట్‌ తీసుకున్నారు. ఈ టికెట్ కింద ఇద్దరు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ఉంటుంది. కానీ రూ.500 చెల్లించిన ఒకరినే దర్శనానికి అనుమతిస్తామని కాణిపాకం సిబ్బంది కిషోర్ గౌడ్‌కు చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనను కిషోర్ గౌడ్ ఎక్స్ వేదికగా నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. నారా లోకేష్ అన్న.. కాణిపాకం దేవాలయంలో దోపిడీ దారుణంగా ఉందని.. రూ.500 టికెట్ తీసుకుంటే ఒక్కరినే దర్శనానికి అనుమతిస్తారని.. అడిగితే రూల్స్ ఇంతే ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నారంటూ ట్వీట్ ద్వారా తన ఆవేదన తెలియజేశారు.


కిషోర్ గౌడ్ ట్వీట్‌కు నారా లోకేష్ స్పందించారు. అలాగే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి కూడా విచారణకు ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన ఆలయ ఈవో పెంచల కిషోర్.. ఆలయ సిబ్బంది తప్పు ఉందని గుర్తించారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా జి. కుట్టి బాబు అనే ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాణిపాకం వినాయకుడి దర్శనం కోసం వచ్చిన భక్తులను సాధారణ ఆశీర్వాదం టికెట్ ఒకరికే అని మభ్యపెట్టడమే కాకుండా.. భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించి దేవాలయ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు టికెట్ కౌంటర్‌లో పనిచేస్తున్న జి. కుట్టి బాబును విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


మరోవైపు సాధారణ ఆశీర్వాదం టికెట్‌పై భక్తులకు ప్రవేశం లేదన్న ఆలయ ఈవో.. దర్శనానికి విడిగా టికెట్ తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని టికెట్ కౌంటర్లో ఉన్న సిబ్బంది భక్తులకు తెలియజేయాలని.. కానీ అలా చెప్పకుండా వారితో దురుసుగా ప్రవర్తించిన కుట్టి బాబును విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa