పాయకరావుపేట మండలంలోని రత్నయ్యమ్మపేట వద్ద సముద్ర తీరానికి సోమవారం రెండు తాబేళ్ల కళేబరాలు కొట్టుకు వచ్చాయి. ఈ ప్రాంతంలో తరచూ తాబేళ్లు చనిపోతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. పరవాడ మండలం నుంచి పాయకరావుపేట మండలం వరకు సముద్ర తీర ప్రాంతంలో రసాయన పరిశ్రమలు, రొయ్యల హేచరీల నుంచి శుద్ధి చేయకుండా విడుదల చేసే కాలుష్య వ్యర్థాల కారణంగా సముద్ర సంపద మృత్యువాత పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం కారణంగా సముద్ర తీరం నుంచి చాలా దూరం వరకు మత్స్య సంపద సంచరించడంలేదని, తాము మైళ్ల కొద్దీ లోపలికి వెళితే తప్ప చేపలు లభ్యం కావడం లేదని అంటున్నారు. ఆదివారం ఉదయం అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద సముద్ర తీరానికి తాబేలు కళేబరం కొట్టుకురావడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో మూడు తాబేళ్ల కళేబరాలు సముద్ర తారానికి కొట్టుకు వచ్చిన విషయాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించాలని, కాలుష్య వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెడుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే మత్స్యసంపదకు ముప్పు వాటిల్లి తాము జీవనోసాధి కోల్పోయే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa