ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోక్‌సభ ముందుకు ‘జమిలి’ బిల్లులు.. తీవ్రంగా వ్యతిరేకించిన ఇండియా కూటమి

national |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 07:46 PM

‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ బిల్లులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ లోక్‌సభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. 129 రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలో లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు న్యాయశాఖ మంత్రి వెల్లడించారు. అయితే, ఈ బిల్లులను కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే సహా విపక్షాలు తీవ్రంగ వ్యతిరేకించాయి. వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇది రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తి దెబ్బతీయడమేనని మండిపడింది.


అయితే, ఈ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు తాము సిద్దమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. 2029లో లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించనున్నారు. అలాగే 2034 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు సైతం దీని పరిధిలోకి రానున్నాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే జమిలి ఎన్నికలకు ఉన్న అడ్డంకులను సైతం కేంద్రం పరిశీలిస్తోంది.


కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకొచ్చిన ఈ బిల్లులను కాంగ్రెస్‌, ఎస్పీ, టీఎంసీ, శివసేన (యూబీటీ), ఎంఐఎం, ముస్లీం లీగ్, డీఎంకే సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు వ్యతిరేకిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇక, ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షమైన టీడీపీ ఈ బిల్లుకు భేషరతుగా మద్దతు ప్రకటించింది. ఈమేరకు టీడీపీ కి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సభకు తెలియజేశారు.


మరోవైపు, బిల్లులను జేపీసీకి పంపడానికి స్పీకర్ సభలో ఓటింగ్ ప్రారంభించారు. అయితే, దీనిపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. డివిజన్ ఓటింగ్ కోసం పట్టుబడుతున్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో మొదటిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరుగుతోంది. సాధారణ మెజార్టీతో బిల్లును ప్రవేశపెట్టేందుకకు అనుమతి లభించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 229 మంది, వ్యతిరేకంగా 194 మంది ఓటేశారు. అయితే, సభ్యులకు తమ ఓటును క్రాస్ చెక్ చేసుకునే అవకాశం స్పీకర్ కల్పించారు.


కాగా, జమిలి బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్దమని, దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ఈ బిల్లుతో బాటలు వేస్తున్నారని, జమిలి నియంతృత్వానికి దారితీస్తాయని ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ఆరోపించారు. కాగా, జమిలీ ఎన్నికల బిల్లులు గట్టెక్కాలంటే లోక్‌సభ, రాజ్యసభలో మూడింట రెండొంతుల మెజార్టీ సాధించాలి. ఇక, ప్రస్తుత బిల్లులో స్థానిక సంస్థల ఎన్నికలను చేర్చకపోవడంతో రాజ్యాంగ సవరణకు.. 50 శాతం రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇదే ఉద్దేశంతో మోదీ సర్కారు వ్యూహాత్మకంగా ఈ బిల్లును రూపొందించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa