మరో నెల రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి దిగిపోనున్న జో బైడెన్.. భారతీయులకు మేలు జరిగేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా నిబంధనలను సడలించారు. దీంతో అమెరికా కంపెనీలకు విదేశీ నిపుణులు, ఉద్యోగులను నియమించుకోవడం మరింత సులభతరమవుతుంది. ఎప్-1 విద్యార్ధి వీసాలు హెచ్-1బీగా మారేందుకు వెసులుబాటు కల్పించింది. దీని వల్ల వేలాది మంది భారతీయ టెక్ నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది. విదేశీ వర్కర్లను అమెరికా కంపెనీల్లో పనిచేయడానికి హెచ్-1బీ వీసా అనుమతిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ టెక్ సంస్థలు ప్రతి ఏటా భారత్, చైనా వంటి దేశాలకు చెందిన వేలాది నిపుణులను హెచ్1 బీ వీసా ఆధారంగానే నియమించుకుంటాయి.
హెచ్-1బీ వీసా నిబంధనల్లో సడలింపులపై డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) మంగళవారం ప్రకటన చేసింది. అమెరికా సంస్థలు, అందులో పనిచేసే విదేశీ వర్కర్లుకు ఎక్కువ సౌలభ్యాన్ని అందించడమే లక్ష్యంగా సడలింపులు చేసినట్టు పేర్కొంది. ఈ మార్పులు.. అమెరికా సంస్థలు తమ అవసరాలు, ప్రపంచ మార్కెట్లో పోటీని దృష్టిలో ఉంచుకుని విదేశీ నిపుణులను నియమించుకునే వెసులుబాటు కల్పిస్తాయని తెలిపింది. అలాగే, స్టూడెంట్ వీసాను కూడా చట్టబద్దంగా హెచ్-1బికి మార్చుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటివరకు ఈ వీసాలకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగినట్టు అయ్యింది.
అంతేకాదు, గతంలో హెచ్-1బీ వీసా పొందిన వారి దరఖాస్తులను యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సేవలు (USCIS) మరింత త్వరగా ప్రాసెస్ చేయడానికి అనుమతిస్తుందని వివరించింది. సహేతుకమైన షరతులకు లోబడి వీసాదారులు H-1B హోదాకు అర్హత పొందేందుకు కూడా అనుమతిస్తుందని చెప్పింది. సడలించిన నిబంధనలు అమెరికాలో విదేశీ వర్కర్లు ప్రయోజనాలను రక్షించి, యజమానులపై అనవసరమైన భారాన్ని తగ్గించడానికి, అమెరికా సంస్థల కార్మికుల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడతాయని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది.
‘తాజా నిర్ణయం అంతర్జాతీయస్థాయి ప్రతిభావంతులను యాజమాన్యాలు నియమించుకునే అవకాశం కల్పించడమే కాదు.. దేశ ఆర్ధిక వ్యవస్థ పురోగతికి సహకరిస్తుంది.. ఆధునిక అమెరికా ఆవిష్కరణల్లో అత్యధిక నైపుణ్యం కలిగి ఉద్యోగుల భాగస్వామ్యానికి అనుమతిస్తుంది’ హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ అలెజాడ్రో ఎన్ మయోర్కస్ అన్నారు. ‘హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని 1990లో కాంగ్రెస్ రూపొందించింది.. మన దేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి దీనిని ఆధునీకరించాల్సిన అవసరం లేదు.. యజమాన్యాల సమగ్రతను పెంపొందించి.. ఆవిష్కరణలకు అవసరమైన అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులను నియమించుకోవచ్చని ఈ మార్పులు నిర్ధారిస్తాయి’ అని యూఎస్సీఐఎసీ డైరెక్టర్ యూఆర్ ఎం జడౌ అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa