డేటా గోప్యత ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలపై సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు ఐరోపా సమాఖ్య భారీ జరిమానా విధించింది. 2018లో లక్షల్లో యూజర్ల వివరాలు బహిర్గతమైనట్టు ఆరోపణలు రావడంతో.. డేటా ఉల్లంఘన కేసు నమోదయ్యింది. దీనిపై యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటక్షన్ కమిషన్ (ఈయూడీపీసీ) దర్యాప్తు చేపట్టింది. గోప్యత హక్కులను ఫేస్బుక్ ఉల్లంఘించినట్టు నిర్దారించిన డీపీసీ.. దాని మాతృ సంస్థ మెటాకు రూ.2,239 కోట్ల (251 మిలియన్ యూరోలు) జరిమానా విధించింది. ఈ మేరకు ఐర్లాండ్ డేటా రక్షణ కమిషన్.. విచారణను ముగించింది.
ఫేస్బుక్ కోడ్లోకి హ్యాకర్లు బగ్లను చొప్పించి.. యూజర్ల అకౌంట్లకు సంబంధించి ‘యాక్సెస్ టోకెన్లు’గా పిలిచే ‘డిజిటల్ కీ’లను కొల్లగొట్టినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో మెటా రీజినల్ ఆఫీసు ఉన్నందున 27 దేశాలతో కూడి ఈయూ నిబంధనల ప్రకారం ఐర్లండ్లోని డీపీసీయే మెటా ప్రధాన నియంత్రణ సంస్థ. జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్కు సంబంధించి అనేక ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించిన ఈ సంస్థ మెటాకు అక్షింతలు వేసింది. అంతటితో ఆగకుండా పరిపాలనా పరమైన జరిమానా కిందట 251 మిలియన్ యూరోలు చెల్లించాలని ఆదేశించింది.
హ్యాకర్లు 2018 సెప్లెంబరు 14 నుంచి 28 మధ్య ఐరోపాలో 30 లక్షల మంది సహా ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది యూజర్ల ఖాతాల్లోకి చొరబడి డేటా చౌర్యానికి పాల్పడినట్టు కమిషన్ పేర్కొంది. ఖాతాదారుల వ్యక్తిగత సమాచార గోప్యతను రక్షించడంలో ఫేస్బుక్ విఫలమైందని మండిపడింది. కాగా, ఈ నిర్ణయంపై అప్పీల్కు వెళతామని ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ప్రకటించింది. కాగా, కొద్ది నెలల కిందట గూగుల్ విషయంలోనూ ఈ విధంగానే ఐరోపా సమాఖ్య జరిమానా విధించిన విషయం తెలిసిందే. సెర్చ్ ఫలితాల్లో ప్రత్యర్థుల కంటే, తన సొంత షాపింగ్ సిఫార్సులకు ప్రాధాన్యత ఇచ్చినట్టు ఆరోపణలతో 2017 నుంచి కొనసాగుతున్న యాంటీ ట్రస్ట్ కేసులో ఈయూ కోర్టi 2.7 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.22,400 కోట్లకుపై మాటే) భారీ ఫైన్ వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa