కొన్ని రోజుల క్రితం లంచం ఆరోపణలతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం భారత రాజకీయాల్లో ఇప్పటికీ పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అదానీకి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ రక్షణగా ఉన్నారని.. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ అదానీ అంశంపై చర్చకు అనుమతించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అదానీ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా నమోదైన కేసుల్లో వాదనలు వినిపించిన అమెరికా ప్రభుత్వం తరఫు లాయర్ బ్రియాన్ పీస్ ఉన్నఫలంగా రాజీనామా చేయడం కీలకంగా మారింది.
అయితే బ్రియాన్ పీస్ రాజీనామా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ నుంచి అమల్లోకి రానుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2021 అక్టోబరు 15వ తేదీన బ్రియాన్ పీస్ను న్యూయార్క్లోని బ్రూక్లిన్ కౌంటీకి అటార్నీ జనరల్గా నియమించారు. ఇక వచ్చే ఏడాది జనవరి 19వ తేదీతో జో బైడెన్ పదవీ కాలం ముగియనుండగా.. ఈ కారణం వల్లే బ్రియాన్ పీస్ కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అదానీ గ్రూప్ లంచం ఆరోపణల కేసుతోపాటు మరెన్నో హై ప్రొఫైల్ కేసుల్లో అమెరికా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన రికార్డు బ్రియాన్ పీస్కు ఉంది.
ఇక మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సోలార్ పవర్ కాంట్రాక్టులను పొందేందుకు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ లంచాలు ముట్టజెప్పిందనే అభియోగాలతో ఈ ఏడాది నవంబరులో అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో కేసులు నమోదయ్యాయి. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఆయన బంధువు ఒకరు కలిసి 2020 నుంచి 2024 మధ్యకాలంలో ఏకంగా రూ.2,029 కోట్ల ముడుపులు ఇచ్చారనే అభియోగాలను నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలు అన్నీ నిరాధారమైనవనని.. అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. ఇక విదేశాల్లో నమోదైన కేసులపై భారత్లో విచారణ జరపలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa