ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి బస్సు బోల్తా.. ఐదుగురు మృతి, 27 మందికి గాయాలు

Crime |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2024, 10:28 PM

పెళ్లంటే నూరేళ్ల పంట.. రెండు మనుసులతో పాటు రెండు కుటుంబాలను ఒక్కటి చేసే ఈ వేడుకను చూసేందుకు బంధువులతో పాటు స్నేహితులు కూడా వెళ్తుంటారు. అక్కడ కన్నులపండువగా సాగే వేడుకను చూస్తూ.. ఎన్నేన్నో జ్ఞాపకాలను మనసులోని దాచుకుని తిరిగి ఇంటికి చేరుకుంటారు. కానీ ఆ పెళ్లికి వెళ్లి జ్ఞాపకాలు దాచుకోవాలనుకున్న ఆ బంధువులకు మాత్రం.. తీరని శోకం మిగిలింది. పెళ్లికి వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురి కావడంతో.. మొత్తం ఐదుగురు మృతి చెందారు. 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఎక్కడ, ఎలా జిరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


దాదాపు 35 మందితో బయలుదేరిన పెళ్లి బస్సు..!


నవీ ముంబయిలోని రాయ్‌ఘఢ్‌ మహద్‌లో వివాహానికి వెళ్లేందుకు పుణే నుంచి ఓ ప్రైవేటు బస్సు బయలు దేరింది. అయితే పెళ్లి వారి తరఫు బంధువులు అంతా ఈ వేడుకకు హాజరయ్యేందుకు ప్రయాణం అయ్యారు. దాదాపు 35 మంది వరకూ ఈ బస్సు ఎక్కారు. ఉదయమే బస్సు ప్రారంభం అయింది. అయితే 9.30 గంటల సమయంలో మంగావ్ సమీపంలోని తమ్హిని ఘాట్ వద్ద ఓ మలుపు వచ్చింది. ఆ మలుపు వద్ద స్టీరింగ్ తిప్పిన డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు ఓ పక్కకు పడిపోయింది.


ఐదుగురు మృతి, 27 మందికి గాయాలు..!


బస్సు బోల్తా పడడంతో పెళ్లికోసం వెళ్తున్న వారంతా ఆర్తనాదాలు పెట్టారు. విషయం గుర్తించిన స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులోని వారు బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అంతలోపే పోలీసులకు కూడా సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారందరినీ బయటకు తీశారు. అనంతరం అంబులెన్స్ ద్వారా స్థానికంగా ఉన్న మంగావ్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి పంపించారు.


ఈక్రమంలోనే తీవ్ర గాయాల పాలైన ఇద్దరు పురుషులతో పాటు ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని మార్చురీకి తరలించినట్లు స్పష్టం చేశారు. అలాగే గాయాల పాలైన 27 మందికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. పెళ్లి కోసం వస్తున్న అతిథులు మార్గ మధ్యంలో ప్రమాదానికి గురై చనిపోయిన విషయం తెలుసుకున్న.. పెళ్లి ఇంటి వాళ్లు తూతూ మంత్రంగా పెళ్లిని జరిపించేశారు. ఆపై వెంటనే ఆస్పత్రికి చేరుకుని ఎవరెవరికి ఏమేం అయిందో తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆస్పత్రి ఆవరణ అంతా క్షతగాత్రుల బంధువులతో నిండిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa