ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి ఉదారతను చాటుకున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి సాయం చేస్తూ బాసటగా నిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో తన దృష్టికి వస్తున్న సమస్యలపై త్వరిత గతిన స్పందిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. విద్యార్థుల సమస్యలపై లోకేష్ స్పందిస్తున్న తీరుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ విద్యార్థికి తాను అండగా ఉన్నానంటూ నారా లోకేష్ భరోసా ఇచ్చారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన ఓ విద్యార్థిని మెదడు సంబంధిత సమస్యతో తీవ్రంగా బాధపడుతోంది.అయితే విద్యార్థిని సమస్యను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో లోకేష్ స్పందించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
మంత్రి లోకేష్ చేసిన సాయంపై విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన మురపాల అనూష అనే విద్యార్థిని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ మొదటి ఏడాది చదువుతోంది. ఎంతో చురుగ్గా ఉండే అనూషకు హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రాణం నిలబెట్టేందుకు మెరుగైన వైద్యం కోసం సాయం అందించాలని సోషల్ మీడియా వేదిక ట్విట్టర్(ఎక్స్) ద్వారా మంత్రి నారా లోకేష్కు అనూష సహచర విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు విజ్ఞప్తి చేశారు.వెంటనే స్పందించిన లోకేష్.. తన టీం ద్వారా అవసరమైన వైద్యసాయం అందించాలని సూచించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనూషకు అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్కు ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థిని పద్మజ ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాదాలు లోకేష్ అన్న అంటూ నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పోస్ట్లు పెడుతూ అభిమానం చాటుకున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పట్ల మంత్రి లోకేష్ చూపిస్తున్న ఆదరాభిమానాలు జీవితంలో మర్చిపోలేం అంటూ ట్విట్టర్లో(ఎక్స్) విద్యార్థులు పోస్ట్లు పెట్టారు. గతంలో కూడా పలువురు విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ బాసటగా నిలిచిన వైనాన్ని విద్యార్థులు గుర్తుకుతెచ్చుకున్నారు. ఆపదలో సాయం చేయడంలో లోకేష్ ఎప్పుడూ ముందు ఉంటారని విద్యార్థులు థ్యాంక్స్ చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa