సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. స్పౌజ్ కేటగిరి కింద కొత్తగా 5,402 మందికి పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసిందని అన్నారు. ఆరేడు నెలలకు ఒకసారి కొత్తగా పింఛన్లు మంజూరు చేసే ధోరణికి స్వస్తి పలికామని తెలిపారు. ఇప్పటికే పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెలే పింఛను ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు.
దీన్నే స్పౌజ్ క్యాటగిరీగా గుర్తిస్తూ పింఛను మంజూరు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నెల నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్బంగా స్పౌజ్ క్యాటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. ఈ నెల నుంచి ఇదే విధానంలో పంపిణీ చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అందులో భాగంగా 5,402 మందికి కొత్తగా ఫించన్లు ఇస్తున్నామని తెలిపారు. నవంబరు 1వ తేదీ నుంచి డిసెంబరు 15వ తేదీ వరకు కొత్తగా 5,402 మందికి వితంతువు (ఇప్పటికే పింఛను తీసుకుంటున్న భర్త చనిపోయిన వారికి) కేటగిరీలో పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీరికి డిసెంబర్ 31వ తేదీన రూ.4 వేల చొప్పున పింఛను పంపిణీ చేయనున్నామని పేర్కొన్నారు. అలాగే గత మూడు నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పింఛన్లు తీసుకోని 50.94,412 మందికి సైతం బకాయిలతో సహా అందించనున్నామని చెప్పారు. వీరికి రెండు, మూడు నెలల మొత్తాన్ని కలిపి ఒకేసారి డిసెంబర్ 31వ తేదీన పింఛన్లు పంపిణీ చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa