ఏలూరు నగరంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత మెయిన్ బజార్లో ఒక జ్యూవెలరీ షాపులో దొంగలు గోడను తవ్వి రంధ్రం పెట్టి వెండి, బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. అపహ రించిన నగల విలువ సుమారు రెండున్నర కోట్ల రూపాయల విలువ ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఏలూరు వన్టౌన్ ప్రాంతానికి చెందిన మానేపల్లి మారుతీ రఘురామ్ మెయిన్బజార్లో లోకేశ్వరి జ్యూయలర్స్ అండ్ బ్యాంకర్స్ వెండి, బంగారు నగల వ్యాపారం చేస్తున్నారు. మరోవైపు వెండి, బంగారపు వస్తువులను తాకట్టు పెట్టుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. షాపు ముందు ఎంతో అందంగా కనిపించిన ఆ షాపు వెనుక మాత్రం ఓ పాడుబడ్డ పురాతన భవనం. దొంగలకు అదే కలిసి వచ్చింది. బయటకు మాత్రం ప్రహరీ గోడ, ఓ చెక్క తలుపు ఉన్నాయి. దొంగలు ముందుగానే రెక్కీ నిర్వహించి ప్రణాళిక ప్రకారం ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు స్పష్టమవుతుంది. మారుతీరఘురామ్ యధావిధిగా ఈనెల 11న రాత్రి 10.30 గంటలకు షాపును కట్టివేసి తాళాలు వేసుకుని వెళ్లారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు షాపు వద్దకు వచ్చి తాళాలు, గేట్లు, తలు పులను తెరచి చూసేటప్పటికీ ఒక్కసారిగా కుప్పకూలి మారుతీ రఘురామ్ కిందపడిపోయాడు. ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరు కోవడంతో షాపులోపల గోడకు పెద్ద రంధ్రం ఉండడాన్ని గమనించారు. వెంటనే ఈ సమాచారాన్ని ఏలూరు వన్టౌన్ సీఐ జి సత్యనారాయణకు అందించారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్, పోలీసు జాగిలాలతో పరిశీలింపచేయించారు. సుమారు పాతిక కేజీల వెండి, రెండున్నర కేజీల బంగారం అపహర ణకు గురైనట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. వెనుకవైపు ఉన్న పురాతన శిధిలం భవనం లోపలకు దొంగలు ప్రవేశించారు. భయంక రంగా ఉన్న ఆ లోపల నుంచి నాలుగు అడుగుల మందం కల్గిన గోడకు రంధ్రం పెట్టి షాపులోపలకు ప్రవేశించారు. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి మరీ నగలను పట్టుకుపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa