మహారాష్ట్రలోని బాద్లాపూర్ పాఠశాలలో గతేడాది ఆగస్టు నెలలో ఇద్దరు చిన్నారులపై అటెండర్ అత్యాచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేయగా.. ఇప్పటికీ ఈ కేసు కొనసాగుతూనే వస్తోంది. అయితే తాజాగా విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. ఈకేసులో బాధితులు చాలా చిన్న పిల్లలు అని త్వరగా విచారణ పూర్తి చేయాలంటూ బాంబే హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని థానే జిల్లా బాద్లాపూర్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో.. నాలుగు, ఐదు సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు చిన్నారులపై అటెండర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ముఖ్యంగా 2024 ఆగస్టులో బడిలోని టాయిలెట్లో ఈ దారుణం జరగగా.. చిన్నారులు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. అలా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో నిందితుడిని వెంటనే పోలీసులు పట్టుకున్నారు. ఆపై విచారణ కోసం జైలు నుంచి కోర్టుకు తరలిస్తుండగా.. పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈక్రమంలోనే నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం.. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
ఆ తర్వాత మహారాష్ట్ర సర్కారు ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సిట్ను ఏర్పాటు చేయగా.. ఛార్జీషీట్ సమర్పించింది. లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేయడంలో విఫలం అయినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మరో ఇద్దరు నిర్వాహకులతో పాటు నిందితుడిని పేరును కూడా ఛార్జీషీట్లో పేర్కొంది. అయితే స్థానిక బాద్లాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారని తేలడంతో హైకోర్టు సుమోటోగా తీసుకుని కేసు విచారణ చేపట్టింది. ఈక్రమంలోనే సోమవారం బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ముఖ్యంగా జస్టిస్ రేవతి మోహితే డెరే, నీలా గోఖలే విచారణ చేశారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ హితెన్ ఛార్జీషీట్ దాఖలు చేశామని చెప్పగా.. బాధితులు చిన్న పిల్లలని, త్వరగా కేసును పూర్తి చేయాలని బాంబే హైకోర్టు వెల్లడించింది. అయితే పోక్సో చట్టం ప్రకారం బాలికల విచారణ సమయంలో ఓ మహిళా ప్రాసిక్యూటర్ హాజరు కావాలని బెంచ్ ఆదేశించగా.. పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సాయంగా మహిళా ప్రాసిక్యూటర్ను నియమించినట్లు తెలిపారు. ఈక్రమంలోనే న్యాయస్థానం కేసు విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు తన కుమారుడిని పోలీసులు ఫేక్ ఎన్కౌంటర్ చేశారంటూ నిందితుడి తండ్రి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను సైతం ఇదే నెల 20వ తేదీన హైకోర్టు విచారించబోతున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa