కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు నిత్యం ఎంతో మంది భక్తులు తరలివస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడిపై భక్తి భావంతో సుదూరాల నుంచి తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే శ్రీవారికి తమకు తోచిన విధంగా కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. ఇక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల సమయంలోనూ ఎంతో మంది శ్రీవారి భక్తులు, దాతలు తిరుమలకు వచ్చి సహాయం చేస్తుంటారు. అన్నదానం నుంచి అలంకరణ వరకూ చేతనైన సాయం చేస్తుంటారు. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన సునీత గౌడ్ అనే దాత తిరుమలలో అలంకరణ చేయించారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అలంకరణ చేయించారు. దాతల సహకారంతో మొదటి రోజు, నాలుగో రోజు, ఏడో రోజు ఆలయం వద్ద పుష్పాలంకరణ చేయించారు. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన సునీతా గౌడ్ అనే దాత సహకారంతో పుష్పాలు, విగ్రహాలతో అలంకరణ చేయించారు. అయితే టీటీడీ సిబ్బంది ఈ విగ్రహాలను శనివారం ఉదయం తొలగించారు. విగ్రహాలను తీసి ట్రాక్టర్లో వేశారు. దీంతో టీటీడీ సిబ్బంది తీరుపై దాత సునీత గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకుంఠ ద్వార దర్శనాల కోసం శ్రీవారి ఆలయ అలంకరణ కోసం రెండో ఏడాది విరాళం ఇచ్చామన్న సునీత్ గౌడ్.. 3 నెలల ముందే పక్కా ప్రణాళిక ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని ఆలయ అలంకరణ చేయించామన్నారు. శ్రీవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఐదు మంది డిజైనర్లు అలంకరణ కోసం కృషి చేశారని తెలిపారు. 15 లక్షల రూపాయలు ఖర్చు చేసి విదేశాల నుంచి పుష్పాలు తెప్పించామన్నారు. విగ్రహాలు, చీరలు ఇలా అన్నీ కలిపి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు వివరించారు. వైకుంఠ ద్వార దర్శనాలలో స్వామి వారికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేశామని.. డబ్బుల కోసం కాదన్నారు. మూడు రోజులు మేల్కొని అలంకరిస్తే.. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండానే టీటీడీ సిబ్బంది ఈ అలంకరణను తొలగించారని సునీత గౌడ్ ఆరోపించారు.
ఎంతో ఖర్చు చేసి విదేశాల నుంచి తెచ్చిన పుష్పాలు, విగ్రహాలతో అలంకరణ చేయించామని.. కనీసం చేసినంత సేపైనా ఉంచలేదంటూ సునీత గౌడ్ టీటీడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తారా అంటూ నిలదీశారు. ఎంతో శ్రమించి వీటిని తయారు చేశామని.. కానీ సమాచారం ఇవ్వకుండా ఎలా తీసేస్తారంటూ టీటీడీ సిబ్బంది తీరుపై సునీత గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు టీటీడీ అధికారులు సునీత గౌడ్కు సర్ది చెప్పి పంపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa